హైదరాబాద్: క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని ఒలింపిక్ పతక విజేత గగన్ నారంగ్ పేర్కొన్నాడు. నిఖత్ జరీన్, ఇషాసింగ్కు ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహాకాలపై నారంగ్ హర్షం వ్యక్తం చేశాడు. డెఫ్లింపిక్స్ (బధిరుల ఒలింపిక్స్)లో స్వర్ణ పతక విజేత ధనుశ్ శ్రీకాంత్, ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ స్టార్ సురభి భరద్వాజ్ను శనివారం హైదరాబాద్లోని గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీ (జీఎఫ్జీ)లో నారంగ్ ఘనంగా సన్మానించాడు. అనంతరం గగన్ నారంగ్ మాట్లాడుతూ.. ‘నిఖత్ జరీన్, ఈషా సింగ్కు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉండడం హర్షణీయం. ధనుశ్, సురభికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రోత్సాహం కల్పిస్తుందని ఆశిస్తున్నా’ అని అన్నాడు.
ఆసియా చాంపియన్ ధనుశ్ ఇటీవల జరిగిన డెఫ్లింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రెండు స్వర్ణాలు కొల్లగొట్టగా.. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్లో సురభి రజతం సాధించింది. వారిద్దరూ గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్ (జీఎన్ఎస్పీఎఫ్), గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీలో శిక్షణ పొందారు. తమకు ఎంతో సహకారం అందించిన నారంగ్కు ఈ సందర్భంగా ధనుశ్, సురభి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు తొలి కోచ్ నిరంజన్రెడ్డిని కూడా సత్కరించారు.