హనుమకొండ చౌరస్తా, మార్చి 30 : నాలుగవ జాతీయ పారా తైక్వాండో పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. ఈనెల 28, 29 తేదీల్లో బెంగళూరులోని కోరమంగళ స్టేడియంలో జరిగిన పోటీల్లో తెలంగాణ పారా తైక్వాండో అసోసియేషన్ (టీపీటీఏ) ఆధ్వర్యంలో పాల్గొన్న క్రీడాకారులు 3 పసిడి, 2 రజత, 3 కాంస్యాలతో మొత్తం 8 పతకాలు సాధించి జాతీయ స్థాయిలో 2వ ఓవరాల్ చాంపియన్ షిప్ను కైవసం చేసుకున్నారు.
ఎల్లావుల గౌతమ్యాదవ్ (పీ51), కే శివ (పీ52), కే లోకేశ్వరి (పీ33) బంగారు, ఎం మమత (పీ52), జీ రాజేశ్ (పీ53) వెండి, సాయక్ అబ్దుల్ (పీ52), సీ జ్ఞానేశ్వర్ (పీ52), ఎం లోకేష్ (కే44 అండర్-80 కేజీ) కాంస్య పతకాలు సాధించారు. వీరి విజయం దేశవ్యాప్తంగా పారా క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాన కార్యదర్శి ఎల్లావుల గణేశ్యాదవ్ అన్నారు.