న్యూయార్క్: పుష్కరకాలంగా యూఎస్ ఓపెన్ టోర్నీ ఆడుతూ 2020లో టైటిల్కు చేరువగా వచ్చినా ఫైనల్లో ఓడిన జర్మనీ ప్లేయర్ అలగ్జాండర్ జ్వెరెవ్ ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకున్నాడు. 12 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈ టోర్నీలో సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నాడు. సోమవారం జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్లో జ్వెరెవ్ 6-3, 7-6 (7/2), 5-7, 6-2తో అమెరికాకు చెందిన బెన్ షెల్టన్ను ఓడించాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన జోష్లో టాప్సీడ్గా బరిలోకి దిగిన ఈ జర్మన్ స్టార్కు టైటిల్ పోరులో షెల్టన్ నుంచి 2, 3 సెట్లలో ప్రతిఘటన ఎదురైనా తన అనుభవంతో పైచేయి సాధించాడు.
ఏటీపీ ర్యాంకుల్లో నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) టాప్-10 నుంచి నిష్క్రమించాడు. ఈ టోర్నీలో తొలిరౌండ్లోనే వెనుదిరిగిన జొకో.. ఐదో స్థానం నుంచి 12వ స్థానానికి పడిపోయాడు. ఆధునిక టెన్నిస్లో దిగ్గజాలుగా వెలుగొందుతున్న ‘బిగ్ త్రీ’ (రోజర్ ఫెడరర్, రఫెల్ నడాల్, జొకోవిచ్) టాప్-10లో లేకుండా ఉండటం 2002 తర్వాత ఇదే ప్రథమం. రెండు దశాబ్దాల పాటు టెన్నిస్ ప్రపంచాన్ని ఏలిన ఈ త్రయంలో ఫెడరర్ 2022లో, నడాల్ 2024లో ఆటకు వీడ్కోలు పలికారు.