GG vs UPW: కీలక మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) భారీ స్కోర్ చేసింది. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 రన్స్ చేసింది. అష్ గార్డ్నర్(60), దయలాన్ హేమలత (57) అర్ధ శతకాలతో చెలరేగారు. 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ గుజరాత్ను వీళ్లిద్దరూ ఆదుకున్నారు. యూపీ బౌలర్లపై విరుచుకు పడుతూ ఎడాపెడా బౌండరీలు బాదారు. దాంతో, ఆ జట్టు భారీ స్కోర్ చేయగలిగింది.యూపీ బౌలర్లలో పర్షవీ చోప్రా, రాజేశ్వరీ గైక్వాడ్ రెండేసి వికెట్లు తీశారు. సోఫీ ఎకిల్స్టోన్, అంజలీ సర్వానీకి ఒక్కో వికెట్ దక్కింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన గుజరాత్కు ఓపెనర్లు లారా వొల్వార్డ్ (17,) సోఫీయా డంక్లెన్(23) శుభారంభం ఇచ్చారు. 41 రన్స్ వద్ద ఓపెనర్ వొల్వార్డ్ను అంజలీ సర్వానీ బౌల్డ్ చేసింది. మరో 5 పరుగులకే డంక్లెన్ను రాజేశ్వరీ గైక్వాడ్ పెవిలియన్ పంపింది. ఆ తర్వాత వచ్చిన హర్లీన్ డియోల్ (4) విఫలమైంది.
గత ఐదు మ్యాచుల్లో పరుగులు చేయని దయలాన్ హేమలత (Dayalan Hemalatha) కీలక మ్యాచ్లో రాణించింది. డబ్ల్యూపీఎల్లో తొలి ఫిఫ్టీ నమోదు చేసింది. దీప్తి శర్మ వేసిన 16వ ఓవర్లో సిక్స్ కొట్టి అర్ధ శతకానికి చేరువైంది. ధాటిగా ఆడిన ఆమె 32 బంతుల్లోనే యాభై రన్స్ చేసింది. స్పిన్నర్ల బౌలింగ్లో భారీ షాట్లు ఆడింది. సిక్స్లు, బౌండరీలు కొట్టింది. అష్ గార్డ్నర్తో కలిసి నాలుగో వికెట్కు 93 పరుగులు జోడించింది. హేమలతను పర్షవి చోప్రా ఔట్ చేసింది. అప్పటికి గుజరాత్ స్కోర్.. 143. ఆ తర్వాత గార్డ్నర్ గేరు మార్చింది. దీప్తి శర్మ ఓవర్లో బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యింది. చివర్లో సుష్మా వర్మ (8), అశ్వనీ కుమారి (5) పర్వాలేదనిపించారు.