IPL | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశాడు. ఐపీఎల్ పలు సీజన్లను ఇంతకు ముందు కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశీగడ్డపై నిర్వహించిన విషయం తెలిసిందే. వచ్చే సీజన్ను స్వదేశంలో పాత పద్ధతి (హోమ్ అండ్ అవే)లోనే మ్యాచ్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో ఆయా టీంలు హోమ్ గ్రౌండ్లో మ్యాచ్లు ఆడే అవకాశం లభించింది. మరో వైపు వచ్చే ఏడాది ఆరంభంలో మహిళల ఐపీఎల్ను ప్రారంభించేందుకు బోర్డు ఆసక్తిగా ఎదురుచూస్తుందన్నాడు. గురువారం అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు బీసీసీఐ అధ్యక్షుడు లేఖ రాశాడు.
గంగూలీ మెన్స్ ఐపీఎల్పై స్పందిస్తూ.. మరింత సమాచారం అవసరమైన సమయంలో ఇవ్వనున్నట్లు చెప్పాడు. వచ్చే ఏడాది నుంచి పురుషుల ఐపీఎల్ స్వదేశానికి తిరిగి వస్తుందని, మొత్తం పది జట్లు తమ హోం గ్రౌండ్స్లో మ్యాచ్లు ఆడుతాయని లేఖలో తెలిపాడు. 2020లో కరోనా విజృంభించినప్పటి నుంచి ఐపీఎల్ను ఎంపిక చేసిన వేదికల్లో మాత్రమే నిర్వహించిన విషయం తెలిసిందే. గత సీజన్ను రెండు విడుతలుగా నిర్వహించిన విషయం తెలిసిందే. రెండో విడతను యూఏఈలోని మూడు గ్రౌండ్లలో మాత్రమే నిర్వహించగా.. 2021 ఐపీఎల్ మొదటి సగం మ్యాచ్లు ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, చెన్నైల్లో జరిగాయి. ప్రస్తుతం మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో పాత పద్ధతిలోనే నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఇక ఆయా జట్లు సొంత గ్రౌండ్లలోనే మ్యాచ్లు ఆడనున్నాయి.
మహిళల ఐపీఎల్ భారత్లో మహిళల క్రికెట్ స్థాయిని పెంచుతుందని బీసీసీఐ భావిస్తున్నది. మహిళల ఐపీఎల్తో పాటు బాలికల అండర్-15 వన్డే టోర్నీని కూడా బీసీసీఐ ప్రవేశపెట్టనుంది. ఈ అంశంపై గంగూలీ స్పందిస్తూ ఈ సీజన్ నుంచి బాలికల అండర్-15 వన్ డే టోర్నమెంట్ను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపాడు. మహిళల క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వృద్ధి సాధించిందని, భారత జాతీయ జట్టు రాణిస్తుందన్నారు. ఈ టోర్నమెంట్ యువతులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు మార్గం సుగమం చేస్తుందని గంగూలీ లేఖలో పేర్కొన్నాడు. బాలికల అండర్-15 మొదటి విడుత డిసెంబర్ 26 నుంచి జనవరి 12 వరకు ఐదువేదికల్లో జరుగనున్నది. బెంగళూరు, రాంచీ, రాజ్కోట్, ఇండోర్, రాయ్పూర్, పూణేలో మ్యాచ్లు జరుగనున్నాయి.