Sania Mirza – Shoaib Malik: భారత్ – పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం.. సరిహద్దుల్లో నిత్యం కల్లోలాలు.. ఇక ఇరు దేశాల మధ్య క్రికెట్, హాకీ, కబడ్డీతో పాటు ఏ క్రీడ అయినా అదొక టగ్ ఆఫ్ వార్ వంటిదే. ఇంతటి సంక్లిష్ట సంబంధాలున్న రెండు దేశాల నుంచి వేర్వేరు రంగాలలో అత్యున్నత స్థాయిలో ఉన్న సానియా మీర్జా – షోయబ్ మాలిక్లు వివాహబంధంతో కలవడం అనేది కచ్చితంగా ఆశ్చర్యం కలిగించేదే. ప్రేమకు సరిహద్దులతో సంబంధం లేదని, మనసులు కలిస్తే మనుషులను గెలవడం అంత కష్టమేమీ కాదని నమ్మిన ఆ జంట.. పుష్కరకాలం కూడా కలిసుండలేకపోయింది. రెండు దేశాల మధ్య సహజంగా ఉన్న శత్రుత్వం కారణంగా ఈ ఇరువురు క్రీడాకారులు విపరీతమైన విమర్శలను ఎదుర్కుని.. మనుషులను గెలిచినా వాళ్లిద్దరూ మనసులను మాత్రం గెలవలేకపోయారు.
ఆస్ట్రేలియాలో మొదలైంది..
భారత టెన్నిస్లో ఓ సంచలనంగా దూసుకొచ్చిన సానియా మీర్జా అప్పటికే ఓ స్టార్. ఈ హైదరాబాదీ ప్లేయర్ ఏ టోర్నీలో ఆడినా తన మార్కు చూపించేది. అవతలి వైపు మాలిక్ కూడా తక్కువోడేం కాదు. బంతితోనూ బ్యాట్తోనూ మ్యాచ్ను మలుపుతిప్పగల ఆల్ రౌండర్. ఈ ఇద్దరూ మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాలో కలుసుకున్నారు. ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఈ ఇద్దరూ ఐదు నెలల పాటు డేటింగ్ చేశారని గతంలో సానియా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తర్వాత ఈ ఇద్దరూ వివాహం చేసుకుందామని ఇరువురి తల్లిదండ్రులను ఒప్పించారు. వీళ్ల పెళ్లి నిశ్చయం అయ్యేనాటికే మాలిక్కు ఓమారు పెండ్లై విడాకులు కాగా సానియాకు స్థానికంగా ఉన్న ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయి పలు కారణాల వల్ల క్యాన్సిల్ అయింది.
నిఖా మన భాగ్యనగరంలోనే..
పెద్దలను ఒప్పించిన ఆ జంట పెండ్లి చేసుకుంది ప్రేమకు చిహ్నమైన మన భాగ్యనగరంలోనే.. 2010 ఏప్రిల్ 15న వీరి నిఖా జరిగింది. బాలీవుడ్, టాలీవుడ్ తారలు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరైన ఈ నిఖా తర్వాత వీళ్ల జీవితం ఏమంత సాఫీగా సాగలేదు. ‘మన శత్రుదేశమైన పాకిస్తాన్ క్రికెటర్ను పెళ్లి చేసుకుంది. ఇక్కడెవరూ దొరకలేదా..?’ అని దేశవ్యాప్తంగా ఆమెపై విమర్శలొచ్చాయి. ఇప్పటంత సోషల్ మీడియా అప్పుడు లేదుగానీ.. అప్పటికీ ఉన్న సామాజిక సాధనాల ద్వారా సానియా తీవ్ర విమర్శలు ఎదుర్కుంది. ఎవరెన్ని మాటలు అన్నా సానియా – మాలిక్ల జోడీ భరించింది. భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు సహజంగానే సానియాను ట్రోల్ చేస్తూ విమర్శలు వచ్చేవి. కొన్నాళ్ల తర్వాత ఈ జంటకు ఇవన్నీ సాధారణమయ్యాయి. 2018లో ఈ జంటకు కొడుకు పుట్టాడు. అతడికి ఇద్దరి పేర్లు కలిసేలా ఇజాన్ మిర్జా మాలిక్ అని పెట్టుకుంది ఈ ఇండో-పాక్ జోడీ.
2020 నుంచి అసలు కథ మొదలు..!
కొడుకు పుట్టిన తర్వాత కొన్నాళ్లు ఆటకు విరామమిచ్చింది సానియా. అదే సమయంలో మాలిక్.. పాకిస్తాన్కు చెందిన నటితో ఎఫైర్ ఉన్నట్టు గుసగుసలు వినిపించాయి. రాను రాను ఇది మరింత ముదిరింది. ఈ విషయం ఆనోటా ఈనోటా సానియా దాకా వచ్చింది. ఇటు ఇండియాలో కాక అటు పాకిస్తాన్లో కాక ఈ ఇద్దరూ దుబాయ్కు మకాం మార్చారు. అయినా మాలిక్లో మార్పు శూణ్యం. కొత్తవాసనలకు అలవాటుపడ్డ మాలిక్ నిత్యం.. కొడుకు, భార్యను వదిలి పాక్ లోనే గడుపుతుండటం (మ్యాచ్లు లేకున్నా) తో సానియా కుటుంబం దీనిపై తీవ్రంగానే స్పందించింది. ఈ ఇద్దరూ నేరుగా మాట్లాడుకోవడం మానేసి కూడా చాలాకాలం అయిందని, ఏ విషయమైనా తమలోని కోపాన్ని ప్రదర్శించేందుకు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుకుంటున్నారనేది ఈ జంట పెట్టే పోస్టులను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.
గతేడాది అయితే ఈ ఇద్దరూ కలిసేఉన్నారని నిరూపించడానికి ఓ టీవీ షో కూడా ప్రసారమైనా అదంతా ఉత్తుత్తిదే అని తర్వాత తేలింది. ఈ ఇద్దరూ విడిపోవడం ఇక లాంఛనమే అనుకుంటున్న తరుణంలో మాలిక్ తాజాగా పాకిస్తాన్ నటి సనా జావేద్ను మనువాడినట్టు బాంబు పేల్చాడు. మాలిక్ పెండ్లి తర్వాత సోషల్ మీడియాలో నిన్నటిదాకా సానియాను నిందించిన నెటిజన్లు.. ఇప్పుడు ఆమెకే మద్దతు నిలుస్తుండటం కొసమెరుపు.. సరిహద్దులను దాటి, మనుషులను గెలిచిన ఈ జంట ఒకరినొకరి మనసులు గెలవలేక విడిపోయారు.