గజ్వేల్, జనవరి 28: సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 17న సిద్దిపేట జిల్లా గజ్వేల్లో స్పోర్ట్స్ హబ్కు శంకుస్థాపన చేయనున్నట్లు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి ప్రకటించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శంకుస్థాపనకు ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. గజ్వేల్లోని మినీ స్టేడియం వద్ద స్పోర్ట్స్ హబ్కు కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని శుక్రవారం అధికారులతో కలిసి వారు పరిశీలించారు. అనంతరం స్థలానికి సంబంధించిన ఉత్తర్వులను యువజన క్రీడాశాఖ జిల్లా అధికారి నాగేందర్కు అప్పగించారు. ఈ సందర్భంగా ప్రతాప్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో గజ్వేల్లో 20 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ హబ్ను నిర్మిస్తున్నాం. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.20 కోట్లతో ముందుగా ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నాం. పూర్తిస్థాయి నిర్మాణానికి రూ.40 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఫిబ్రవరి 16వ తేదీన ఇక్కడ ఫుట్బాల్ టోర్నీ, 17న బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తాం’ అని వెల్లడించారు. కార్యక్రమంలో ఐఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ సుశిత్, ఆర్డీవో విజయేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.