రాబోయే ఐదేండ్ల కాలానికి గాను ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ భారీగా ఆర్జించడం చూసి పాకిస్తాన్ క్రికెటర్లకు నిద్రపట్టడం లేదు. ఐపీఎల్ పై ఇష్టారీతిన మాట్లాడుతూ అబాసుపాలవుతున్నారు. 2023-27 కాలానికి గాను మీడియా రైట్స్ రూ. 48,390 కోట్లు అమ్ముడుపోవడంపై పాకిస్తాన్ మాజీ సారథి రషీద్ లతీఫ్.. ఐపీఎల్ పై తన అక్కసును వెళ్లగక్కాడు. అక్కడంతా వ్యాపారమే అని.. నాణ్యమైన క్రికెట్ ఆడటం లేదని నీతులు చెప్పాడు.
ఐపీఎల్ మీడియా రైట్స్ భారీగా అమ్ముడైన నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానెల్ లో లతీఫ్ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ అంతా వ్యాపారమే. ఇక్కడ మనం క్రికెట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది సరైన పద్ధతి కాదు. నాణ్యమైన క్రికెట్ ఆడే విధానం ఇది కాదు. మీరు కేవలం డబ్బు సంపాదన మీదే దృష్టి కేంద్రీకరిస్తే అదే దారిలో చాలా మంది ఉన్నారు.. ఐపీఎల్ లో నాణ్యత లేదు. అక్కడుంది బిజినెస్ మాత్రమే..
ఐపీఎల్ జరుగుతున్న సమయంలో మీరు ఎవరైనా భారతీయుడిని పిలిచి నువ్వు ఎన్ని గంటలు క్రికెట్ చూస్తావని అడగండి. సమాధానం మీకే తెలుస్తుంది. అందుకే నేను దానిని బిజినెస్ అంటున్నా. మరి ఈ లీగ్ ఎంతకాలం నిలబడుతుందో చూద్దాం..’ అని తన అక్కసునంతా యూట్యూబ్ లో వెళ్లగక్కాడు.
మూడు రోజుల క్రితం పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కూడా ఐపీఎల్ పై ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అఫ్రిది స్పందిస్తూ.. ‘భారత్ లో క్రికెట్ కు మంచి మార్కెట్ ఉంది. అందుకే ప్రపంచ క్రికెట్ లో వాళ్లు ఏది చెబితే అది చెల్లుబాటు అవుతుంది..’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా లతీఫ్, అఫ్రిది వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఐపీఎల్ మీద పడి ఏడ్చేకంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో ఆడే విదేశీ ఆటగాళ్లకు జీతాలు సరిగా చెల్లించండి.. అని చురకలంటిస్తున్నారు.