ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయెబ్ మాలిక్(Shoaib Malik) మూడోసారి పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మాజీ క్రికెటర్ స్పందించారు. సోషల్ మీడియా ద్వారా తనపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. మూడో పెళ్లి గురించి వస్తున్న వార్తలు అవాస్తవం అని, తప్పుడు పద్ధతిలో తన గురించి ప్రచారం చేస్తున్నట్లు షోయెబ్ పేర్కొన్నాడు. దీనిపై ఆ క్రికెటర్ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వ్యక్తిగత విషయాల పట్ల మౌనంగా ఉండడం వల్ల తనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, అదే నిజం అనుకుంటున్నారని, తన రెండో భార్య సనా జావెద్ పట్ల ఆన్లైన్లో జరుగుతున్న ట్రోలింగ్పై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని షోయెబ్ తన ప్రకటనలో కోరాడు.
భారత టెన్నిస్ స్టార్ , హైదరాబాదీ క్రికెటర్ సానియా మీర్జాను షోయెబ్ మాలిక్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరూ 2023లో ఒప్పందం ప్రకారమే వేరుపడ్డారు. విడిపోయిన ఆ ఇద్దరూ.. తమ కుమారుడికి పేరెంట్స్గా ఉండేందుకు అంగీకరించారు. అయితే 2024 జనవరి 19వ తేదీన షోయెబ్ మాలిక్ రెండో పెళ్లి చేసుకున్నాడు. కరాచీలో జరిగిన నిఖా సెర్మనీలో సనా జావెద్ను అతను పెళ్లాడాడు. షోయెబ్ తన స్టేట్మెంట్లో మొదటి పెళ్లి గురించి ప్రస్తావించాడు. మరోసారి పెళ్లి చేసుకోవడానికి ముందే తన తొలి మ్యారేజ్ను ముగించినట్లు చెప్పాడు. పబ్లిక్కు దూరంగా తన ప్రైవేటు జీవితాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు.
అయితే ఆన్లైన్లో ప్రచారం అవుతున్న కథనాలు చదివే స్థాయిలో తన కుమారుడు ఉన్నాడని, ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఊహాగానాలకు బదులు ఇవ్వాల్సి వస్తుందని షోయెబ్ తన స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. తనకు ఇష్టమైన వ్యక్తులపై అనుచిత కామెంట్లు చేయడం బాధాకరంగా, హానికరంగా ఉన్నట్లు చెప్పాడు. షోయెబ్ ఈసారి వార్నింగ్ కూడా ఇచ్చాడు. తనపై ఊహాజనిత వార్తలు ప్రచారం చేస్తే, దాన్ని పరువునష్టంగా భావించి, న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపాడు. ప్రైవసీ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. సోషల్ మీడియా ప్రచారం ఊహాజనిత కథనాలతో వ్యక్తిగత జీవితాలను నాశనం చేయరాదు అని షోయెబ్ కోరాడు.