ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచిన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగిన ఆ జట్టు.. లీగ్ ప్రారంభానికి ముందే కెప్టెన్ను మార్చింది. ధోనీ నుంచి పగ్గాలు అందుకున్న జడేజా తన కెప్టెన్సీతోనే కాకుండా ఆటతీరులో కూడా విఫలమయ్యాడు. పేలవ ఫామ్ కనబరిచాడు.
ప్రస్తుతం ఈ జట్టును కాంట్రవర్సీలు చుట్టుముట్టి ఉన్నాయి. కెప్టెన్సీని మళ్లీ ధోనీకే అప్పగించిన జడేజా.. గాయం కారణంగా మిగతా సీజన్కు దూరమైనట్లు టీం యాజమాన్యం ప్రకటించింది. అయితే తనను కెప్టెన్గా తొలగించడంతో కోపం వచ్చి జడేజా వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మరో స్టార్ ఆటగాడు అంబటి రాయుడు కూడా రిటైర్మెంట్ ప్రకటించి, ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నాడు.
ఈ పరిస్థితులపై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. ఈ ఏడాది చెన్నై జట్టు డ్రెస్సింగ్ రూం కలిసికట్టుగా కనిపించలేదని అతను అన్నాడు. అయితే అది గొప్ప జట్టు అని, ఈ ఏడాది జరిగిన తప్పులను వచ్చే ఏడాది మళ్లీ రిపీట్ చెయ్యదని అభిప్రాయపడ్డాడు. వచ్చే ఐపీఎల్లో చెన్నై జట్టు మరింత బలంగా తిరిగొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.