టెస్టు కెప్టెన్గా తప్పుకుంటున్నట్లూ ప్రకటించి, క్రీడాలోకానికి పెద్ద షాకిచ్చాడు కోహ్లీ. దీనిపై చాలామంది రకరకాలుగా స్పందించారు. ఈ క్రమంలోనే భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్గా తనను తొలగించడం కోహ్లీకి ఇష్టం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడని అభిప్రాయపడ్డాడు.
చాలా తక్కువ కాల వ్యవధిలో కోహ్లీ నుంచి చాలా కీలకమైన ప్రకటనలు వచ్చాయనే విషయాన్ని మంజ్రేకర్ ఎత్తిచూపాడు. ‘‘ఒకదాని తర్వాత మరొకటిగా ఈ ప్రకటనలు చాలా తక్కువ వ్యవధిలో వచ్చాయి. అలాగే ఇది కూడా ఎవరూ ఊహించలేదు. తనను కెప్టెన్గా మరొకరు తొలగించడం ఇష్టం లేకనే కోహ్లీ ఇలా చేశాడని నేను అనుకుంటున్నా. తన కెప్టెన్సీ ప్రమాదంలో ఉందనిపిస్తే అతను దాన్ని వదిలేస్తాడు’’ అని మంజ్రేకర్ అన్నాడు.
రవిశాస్త్రి వెళ్లిపోయిన తర్వాత కోహ్లీ తన కంఫర్ట్ జోన్లో ఉండలేకపోయాడని కూడా అభిప్రాయపడ్డాడు. అనిల్ కుంబ్లే కోచ్గా ఉన్నప్పుడు కోహ్లీ కొంత ఇబ్బంది పడ్డాడని, కానీ రవిశాస్త్రి అండ్ టీం వచ్చాక చాలా కంఫర్ట్గా ఉన్నాడని చెప్పాడు. బీసీసీఐ అధికారం మారడం, రవిశాస్త్రి వెళ్లిపోవడంతోపాటు కొత్త కోచ్ ద్రావిడ్ నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుందో కూడా కోహ్లీకి అర్థమైనందువల్లే తాజా నిర్ణయం తీసుకొని ఉండొచ్చని మంజ్రేకర్ పేర్కొన్నాడు.