Suresh Raina | టీమిండియా మాజీ ప్లేయర్ సురేష్ రైనా చిక్కుల్లోపడ్డాడు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్కు సంబంధించి బుధవారం విచారణకు హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. అక్రమ బెట్టింగ్ యాప్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని నోటీసుల్లో అధికారులు ఆదేశించినట్లుగా పీటీఐ కథనం పేర్కొంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేంద్ర దర్యాప్తు సంస్థ అతని వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నది. 1xBet అనే యాప్కు సంబంధించిన అక్రమ బెట్టింగ్ కేసులో విచారణ కోసం ఆగస్టు 13న ఏజెన్సీ ముందు హాజరు కావాలని రైనాను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. యాప్కు సంబంధించిన ప్రకటనల్లో సురేశ్ రైనా కనిపించాడు.
అక్రమ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసులను ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ చాలా మంది వ్యక్తులతో పాటు పెట్టుబడిదారులను రూ.కోట్లల్లో మోసం చేయడంతో పాటు భారీ మొత్తంలో పన్ను ఎగవేసినట్లు ఆరోపణలున్నాయి. సురేశ్ రైనా టీమిండియా మాజీ ప్లేయర్. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 322 అంతర్జాతీయ మ్యాచులు ఆడి దాదాపు 8వేల పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారతీయ క్రికెటర్ రైనా. ఐపీఎల్లోనూ సీఎస్కే తరఫున ఆడాడు. ఐపీఎల్ రైనా కెరీర్ అద్భుతంగా ఉంది. 205 మ్యాచ్ల్లో 5,528 పరుగులు చేశాడు. నాలుగు సార్లు సీఎస్కేను చాంపియన్గా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించాడు.