Lokesh Kumar | కష్టానికే ఫలితం ఉంటుంది అన్న నానుడికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచాడు ఓ స్విగ్గీ డెలివరీ బాయ్. ఆర్థిక ఇబ్బందులతో బతుకు దెరువు కోసం స్విగ్గీ బాయ్గా ఇన్నింగ్ ప్రారంభించిన ఓ యువకుడు.. నెదర్లాండ్స్ క్రికెట్ నెట్ బౌలింగ్ టీమ్లో ఎంపికై ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. తమిళనాడుకు చెందిన 29 ఏండ్ల లోకేష్ కుమార్ (Lokesh Kumar) కొంతకాలంగా స్విగ్గీ డెలివరీ (Swiggy) బాయ్గా పనిచేస్తున్నాడు. ఆర్థికంగా కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తూనే తనకు ఇష్టమైన క్రికెట్ ఆటలో సన్నద్ధమయ్యేవాడు. రోజంతా ఫుడ్ డెలివరీ చేసిన తర్వాత రాత్రి సమయంలో క్రికెట్ సాధన చేసేవాడు.
ఇదిలా ఉండగా.. ఈ సారి వన్డే ప్రపంచకప్ 2023 భారత్ వేదికగా జరుగనుంది. ఈ టోర్నీ అక్టోబర్ 5న ప్రారంభమై నవంబర్ 19 వరకు జరిగే అవకాశం ఉంది. ఇక ఈ టోర్నీలో భాగంగా ప్రపంచ కప్ సన్నాహక శిబిరంలో నెట్ బౌలింగ్ కోసం భారత ఆటగాళ్లు కావాలంటూ నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు వినూత్న రీతిలో ప్రకటన జారీ చేసింది.
ఈ ప్రకటన చూసిన లెఫ్టార్మ్ పేసర్ లోకేష్ కుమార్ స్విగ్గీ బాయ్గా చేస్తూనే.. మరోవైపు దీనికి అప్లయ్ చేశాడు. ఇక ఈ అప్లికేషన్లో భాగంగా బౌలర్ ఒక ఓవర్ బౌలింగ్ చేసిన వీడియోను పంపాలని నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు (Netherlands Cricket Board)కోరగా.. లోకేష్ తను బౌలింగ్ చేసిన వీడియోను పంపాడు. ఇది చూసిన నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు లోకేష్ను ఎంపిక చేసింది. కాగా.. ఒక ఫుడ్ డెలివరీ పార్టనర్ నెదర్లాండ్స్ క్రికెట్ జట్టుకు నెట్ బౌలర్గా ఎంపికవ్వడంతో సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. తపన, సంకల్పం బలంగా ఉన్నప్పుడే ఇలాంటి అద్భుత విజయాలు సాధిస్తారని యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ‘కంగ్రాట్స్’ అని కామెంట్లు పెడుతున్నారు. ఇక లోకేష్తో పాటు మరో ముగ్గురు భారత బౌలర్లను నెదర్లాండ్స్ బోర్డ్ ఎంపిక చేసింది.
Thank you for the overwhelming response to our net bowlers hunt, India. Here the 4 names who will be part of the team’s #CWC23 preparations. 🙌 @ludimos pic.twitter.com/arLmtzICYH
— Cricket🏏Netherlands (@KNCBcricket) September 19, 2023