హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): భారత వాయుసేనలోకి అగ్నివీర్ వనితలు అడుగుపెట్టారు. పురుషులతో సమానంగా కదం కలిపి కవాతు నిర్వహించారు. వాయుసేనకు చెందిన మహిళా అగ్నివీర్లు తొలిసారిగా పురుషులతో కలిసి కవాతు చేశారు.
హైదరాబాద్లోని ఎయిర్మెన్ ట్రైనింగ్ స్కూల్లో 2,280 మంది వాయు అగ్నివీర్లకు 22 వారాలపాటు శిక్షణ ఇచ్చి, శనివారం పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్లో 153 మంది మహిళా వాయు అగ్నివీర్ల కవాతు, విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఎయిర్ మార్షల్ ఆర్ రధీశ్ అగ్నివీర్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వాయు అగ్నివీర్లను అభినందించారు. అవార్డులు ప్రదానం చేశారు. వాయు సేన సైనిక సంసిద్ధతను, లక్ష్యాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా వాయుసేనలోకి అగ్నివీర్లను పంపిన వారి తల్లిదండ్రులను ఆయన అభినందించారు. వైమానికదళంలో కూడా ఈ ఏడాది జూన్ 28న అగ్నిపథ్ పథకాన్ని తొలిసారిగా కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. వాయు అగ్నివీరులంతా దేశం గర్వించేలా విధులు నిర్వర్తించాలని ఎయిర్ మార్షల్ రధీశ్ పిలుపునిచ్చారు.