బ్రిస్బేన్: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ సమరానికి వేళయైంది. బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య గబ్బా మైదానం వేదికగా తొలి టెస్టు మొదలవుతున్నది. యాషెస్ను ఎలాగైనా దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న రెండు జట్లు గెలుపు కోసం అహరహం శ్రమించనున్నాయి. సొంతగడ్డపై పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటూ సత్తాచాటాలని ఆసీస్ పట్టుదలతో ఉంటే..దీటైన పోటీనిచ్చేందుకు ఇంగ్లండ్ తహతహలాడతున్నది. టిమ్ పైన్ స్థానంలో కొత్తగా సారథ్య బాధ్యతలు అందుకున్న ప్యాట్ కమిన్స్ జట్టును ఎలా నడిపిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. అటు బౌలింగ్తో పాటు ప్రత్యర్థిపై వ్యుహాలు రచించడంలో కమిన్స్ ఎలా రాణిస్తాడో చూడాలిక. మరోవైపు జో రూట్ నేతృత్వంలోని ఇంగ్లండ్..అస్త్రశస్ర్తాలతో ఆసీస్ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్కు విశ్రాంతినిచ్చిన మేనేజ్మెంట్..అడిలైడ్ టెస్టు(డే అండ్ నైట్) కోసం సమాయత్తం చేస్తున్నది. ఆరు వారాల తేడాతో ఐదు టెస్టులు ఆడాల్సిన నేపథ్యంలో అండర్సన్ గాయాల పాలు కాకుండా ఈసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. యాషెస్ సిరీస్ సుదీర్ఘ చరిత్ర విషయానికొస్తే ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 71 సిరీస్లు జరుగగా ఆస్ట్రేలియా(33), ఇంగ్లండ్(32), ఆరు డ్రాగా ముగిశాయి. విజయాల పరంగా సమవుజ్జీలుగా కనిపిస్తున్న ఇరు జట్లు యాషెస్ను ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయో అర్థమవుతుంది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో నిర్వహకులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.