న్యూఢిల్లీ : భయపడుతున్నదే జరిగింది! భారత ఫుట్బాల్ సంఘం(ఏఐఎఫ్ఎఫ్)పై అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘం(ఫిఫా) నిషేధం విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నది. భారత ఫుట్బాల్ వ్యవహారాలలో ఇతరుల జోక్యంపై ఫిఫా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిషేధం విధిస్తున్నట్టు వర్తమానం పంపింది. అంతేగాక భారత్లో అక్టోబరు 11-30 తేదీలలో నిర్వహించాల్సిన అండర్-17 మహిళల ప్రపంచ కప్ నిర్వహణను కూడా రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఈ హఠాత్ పరిణామంతో భారత ఫుట్బాల్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్(సీవోఏ) సిఫారసుల మేరకు సత్వరమే ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రం.. సుప్రీం కోర్టును అభ్యర్థించింది.
ఇతరుల జోక్యంపై ఫిఫా అసంతృప్తి:
భారత ఫుట్బాల్ సంఘం తన 85 ఏండ్ల చరిత్రలో ఫిఫా నిషేధం ఎదుర్కోవడం ఇదే ప్రథమం. భారత ఫుట్బాల్ సంఘం వ్యవహారాలలో ఇతరుల జోక్యం సహించబోమని, ఇది తమ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఫిఫా తన లేఖలో పేర్కొన్నది. గత కొంతకాలంగా వర్గపోరుతో భారత ఫుట్బాల్ సంఘం వ్యవహారాలు వీధికెక్కాయి. కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఏఐఎఫ్ఎఫ్ కార్యకలాపాల నిర్వహణకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇది నచ్చని ఫిఫా గతంలోనే లేఖ రాస్తూ భారత ఫుట్బాల్ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం లేకుండా వీలైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దుకోవాలని ఏఐఎఫ్ఎఫ్కు సూచించింది. అయినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో ఇతరుల జోక్యాన్ని నిరసిస్తూ ఫిఫా కఠిన నిర్ణయం తీసుకుంది. ఏఐఎఫ్ఎఫ్ తన వ్యవహారాలను తానే చక్కదిద్దుకునే వరకు నిషేధం కొనసాగుతుందని ఫిఫా పేర్కొన్నది. ఈ నిషేధంతో ఈ ఏడాది భారత్లో నిర్వహించాల్సిన అండర్-17 మహిళల ప్రపంచకప్ టోర్నీ కూడా చేజారనున్నది. మెగా టోర్నీ నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఫిఫా వెల్లడించింది.
సుప్రీంకోర్టుకు కేంద్రం వినతి:
భారత ఫుట్బాల్ సంఘంపై నిషేధంతో కేంద్రం స్పందిస్తూ ఏఐఎఫ్ఎఫ్ వ్యవహారాలకు సంబంధించి సత్వరమే నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టులో తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. ఏఐఎఫ్ఎఫ్ వ్యవహారాలను ప్రస్తుతం సుప్రీంకోర్టు నియమిత కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పర్యవేక్షిస్తున్నది. తాజా పరిణామంతో ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికలు, నూతన కార్యవర్గ నియామకం, తదితర అంశాలపై తక్షణమే విచారణ చేపట్టాలని కేంద్రం సుప్రీం కోర్టుకు విన్నవించింది. ఏఐఎఫ్ఎఫ్పై నిషేధం ఎత్తివేయించేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని, అండర్-17 ఫుట్బాల్ ప్రపంచకప్ను వదులుకునేందుకు సిద్ధంగా లేదని భారత ఫుట్బాల్ సంఘం అధికారి ఒకరు తెలిపారు. ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికలు పారదర్శకంగా జరగాలని, నూతన కార్యవర్గం భారత ఫుట్బాల్ కార్యకలాపాలను స్వతంత్రంగా నిర్వహించుకోవాలని ఫిఫా ఆశిస్తున్నట్టు ఆ అధికారి తెలిపారు.
ఎన్నికల ప్రక్రియ షురూ:
సుప్రీంకోర్టు నియమిత కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్(సీవోఏ) ఎన్నికల నిర్వహణకు కార్యాచరణ ఇప్పటికే ప్రకటించింది. ఎన్నికలు ఈ నెల 28న నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా బుధవారం నుంచి శుక్రవారం వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎన్నికల అధికారిని నియమించడంతో పాటు ఎన్నికల్లో పాల్గొనే వారి జాబితాను కూడా సిద్ధం చేశారు. ఈ వ్యవహారమంతా వీలైనంత త్వరగా పూర్తిచేసి ఫిఫా నిషేధం నుంచి బయటపడాలని ఫుట్బాల్ వర్గాలు ఆశిస్తున్నాయి. ఫిఫా నిషేధం తొలిగిపోతే జూనియర్ మహిళల ప్రపంచకప్ నిర్వహణ మనకే దక్కుతుందని భావిస్తున్నారు. సస్పెన్షన్ ఎత్తివేసే వరకు మన ఫుట్బాల్ జట్లు అంతర్జాతీయ మ్యాచ్లలో పాల్గొనేందుకు, రెఫరీలు, అధికారులు అంతర్జాతీయ మ్యాచ్లకు అధికారికంగా హాజరయ్యేందుకు అవకాశం ఉండదు.
ఇది చీకటి రోజు
భారత ఫుట్బాల్ చరిత్రలో ఇది చీకటి రోజని హైదరాబాద్ మాజీ ఫుట్బాల్ ప్లేయర్లు విక్టర్ అమల్రాజ్, జీపీ పాల్గున, షబ్బీర్ అలీ, సయ్యద్ నయిముద్దీన్ అభిప్రాయపడ్డారు. ఫిఫా నిషేధం విషయంలో కేంద్రం, సుప్రీం కోర్టు కలుగజేసుకుని సమస్యను పరిష్కరించాలని సూచించారు. సాధ్యమైనంత తొందరగా ఇది సద్దుమణిగితే.. అండర్-17 ప్రపంచకప్ టోర్నీ నిర్వహణకు అవకాశముంటుందన్నారు.
ఇది కఠిన నిర్ణయం : బైచుంగ్ భూటియా
భారత ఫుట్బాల్ సంఘంపై నిషేధం కఠిన నిర్ణయమని, అయితే వ్యవహారాలను గాడిన పెట్టేందుకు ఇది ఒక చక్కని అవకాశమని మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా వ్యాఖ్యానించాడు. భారత ఫుట్బాల్ వ్యవస్థలోని అన్ని విభాగాలు కలిసి పనిచేసి ఫుట్బాల్ వ్యవహారాలను చక్కదిద్దుకోవాలని అతడు సూచించాడు.