FIFA | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (AIFF)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (FIFA) కౌన్సిల్ బూర్యో ఏకగ్రీవంగా నిర్ణయించింది’’ అని ఫిఫా ఒక ప్రకటనలో తెలిపింది. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (AIFF) తన రోజువారీ వ్యవహారాలపై పూర్తి నియంత్రణను తిరిగి పొందే వరకు సస్పెన్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.
సస్పెన్షన్ కారణంగా ఈ ఏడాది అక్టోబర్ 11-30 తేదీల్లో భారత్లో జరగాల్సిన FIFA U-17 మహిళల ప్రపంచ కప్ 2022 టోర్నీపై అనిశ్చితి నెలకొన్నది. భారత్ నుంచి టోర్నీని మరో దేశానికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. టోర్నీకి సంబంధించి తదుపరి చర్యలను అంచనా వేస్తున్నామని, అవసరమైతే కౌన్సిల్ బ్యూరోకు రెఫర్ చేయనున్నట్లు ఫిఫా తెలిపింది. ఈ మేరకు భారత యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖతో నిరంతరం నిర్మాణాత్మక సంప్రదింపులు జరుపుతున్నామని, ఇందుకు సంబంధించి సానుకూల ఫలితం వస్తుందనే ఆశాభావంతో ఉన్నామని ఫిపా పాలకమండలి తెలిపింది.