జ్యూరిచ్: ఫుట్బాల్ అభిమానులకు ఊరట కల్గించే వార్త. ఆల్ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్)పై విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య(ఫిఫా)శుక్రవారం ఎత్తివేసింది. ఏఐఎఫ్ఎఫ్లో కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్(సీవోఏ) ప్రమేయాన్ని సుప్రీం కోర్టు నిలువరించిన నేపథ్యంలో ఫిఫా తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్ వేదికగా అక్టోబర్లో జరుగాల్సిన ప్రతిష్ఠాత్మక మహిళల అండర్-17 ప్రపంచ కప్ టోర్నీ నిర్వహణకు మార్గం సుగమమైంది. ‘ఏఐఎఫ్ఎఫ్ పరిపాలన వ్యవహారాల్లో సీవోఏ కలుగజేసుకోవడంపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దీంతో తిరిగి పాలన పగ్గాలు ఏఐఎఫ్ఎఫ్ చేతుల్లోకి వచ్చాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ఫిఫా కౌన్సిల్ సస్పెన్షన్ ఎత్తివేతకు మొగ్గుచూపింది. ఈ కారణంగా షెడ్యూల్ ప్రకారం మహిళల అండర్-17 ప్రపంచకప్ నిర్వహణకు లైన్ క్లియర్ అయ్యింది. నిబంధనలకు అనుగుణంగా ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికలు జరిగేలా ఆసియా ఫుట్బాల్ కాన్ఫిడరేషన్(ఏఎఫ్సీ) పర్యవేక్షిస్తుంది’ అని ఫిఫా పేర్కొంది.