ఫుట్బాల్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ మరో రెండు రోజుల్లో మొదలుకానుంది. అయితే, టోర్నీ ఆరంభానికి ముందే అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది ఫిఫా. వరల్డ్ కప్ మ్యాచ్లు జరిగే ఎనిమిది స్టేడియాల్లో బీరు అమ్మొద్దని ఫిఫా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. స్టేడియాల్లో బీరు అమ్మకాలకు అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే విషయంలో ఖతర్, ఫిఫా మధ్య కొన్ని నెలలు చర్చలు జరుగుతున్నాయి. మ్యాచ్లు జరిగే స్టేడియాల్లో బీరు అమ్మకాలపై నిషేధం విధించాలని ఖతర్ అధికారులు, ఫిఫా మీద ఒత్తిడి తెచ్చారు. దాంతో, స్టేడియాల్లో బీరు అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఫిఫా నిర్ణయం తీసుకుంది.
ఫిఫా ఇప్పటికే బడ్వైజర్ బీరు కంపెనీతో 75 మిలియన్ డాలర్ల స్పాన్సర్షిప్ ఒప్పందం చేసుకుంది. ఫిఫా నిర్ణయంతో ఆ ఒప్పందం సందిగ్దావస్థలో పడింది. అయితే, అభిమానులను నిరాశపరచకూడదని ఫిఫా ఫ్యాన్ ఫెస్టివల్, లైసెన్స్ ఉన్న కేంద్రాల్లో బీర్ల అమ్మకానికి ఫిఫా ఓకే చెప్పింది. ఈ ఏడాది 22వ ఫిఫా వరల్డ్కప్ పోటీలు ఖతర్లో జరగనున్నాయి. ఫిఫా వరల్డ్ కప్ నవంబర్ 20వ తేదీన ప్రారంభమై, డిసెంబర్ 18వ తేదీన ముగుస్తుంది. టైటిల్ కోసం 32 దేశాల జట్లు పోటీపడనున్నాయి. మొదటి మ్యాచ్లో ఖతర్, ఈక్వెడార్ ఫుట్బాల్ జట్లు తలపడతాయి.