మొహాలీ: టీమ్ఇండియా అభిమానులకు శుభవార్త! భారత్, శ్రీలంక మధ్య శుక్రవారం నుంచి మొహాలీ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుకు 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ మ్యాచ్ విరాట్కు వందో టెస్టు కానుండగా.. ప్రతిష్ఠాత్మక మ్యాచ్ కోసం పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) కసరత్తులు ముమ్మరం చేసింది. ‘తొలి టెస్టుకు ప్రేక్షకులను అనుమతించనున్నాం. పీసీఏ అధికారులతో తీవ్ర చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాం. విరాట్ కోహ్లీ వందో టెస్టు లాంటి చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించడం ఎంతో ప్రత్యేకం’అని బీసీసీఐ కార్యదర్శి జై షా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాడు. కరోనా వైరస్ కారణంగా తొలుత ఈ మ్యాచ్ను ఖాళీ మైదానంలో ప్రేక్షకులను అనుమతించకుండా నిర్వహించాలని పీసీఏ భావించినా.. బోర్డు నుంచి ఉత్తర్వులు వెలువడటంతో హుటాహుటిన ఏర్పాట్లు చేస్తున్నది. వైద్య నిపుణుల సలహాల అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. ఇటీవల కోల్కతా, ధర్మశాలలో టీమ్ఇండియా మ్యాచ్లకు పరిమిత సంఖ్యలో అభిమానులను అనుమతించిన విషయం తెలిసిందే.
సుదీర్ఘ ఫార్మాట్లో ఇప్పటి వరకు 99 మ్యాచ్లాడి 50.39 సగటుతో 7962 పరుగులు చేసిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని.. ప్రతిష్ఠాత్మక వందో టెస్టుకు ముందు సన్మానించనున్నట్లు పీసీఏ అధికారులు తెలిపారు. ‘చాంపియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆడనున్న వందో టెస్టుకు ఆతిథ్యమివ్వడం ఆనందంగా ఉంది. అతడు దేశం తరఫున మరిన్ని మ్యాచ్లాడాలి. ఇలాంటి అపురూప ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూడటం మంచి అనుభూతి. 50 శాతం మందిని అనుమతించమని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ సమాచారమిచ్చారు. దీంతో అందుకు అవసరమైన కసరత్తులు చేస్తున్నాం. బుధవారం నుంచి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంచనున్నాం’అని పీసీఏ కోశాధికారి ఆర్పీ సింగ్లా తెలిపాడు.
వందో టెస్టు మ్యాచ్ అనేది విరాట్ కోహ్లీ కీర్తికిరీటంలో మరో కలికితురాయని ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేర్కొన్నాడు. విరాట్ సారథ్యంలోనే అరంగేంట్ర మ్యాచ్ ఆడిన బుమ్రా.. తన మాజీ కెప్టెన్ను ఆకాశానికెత్తాడు. ‘వందో మ్యాచ్ అనేది ఏ ఆటగాడికైనా ప్రత్యేకమైనదే. కఠోర శ్రమ, అంకితభావానికి అదో గుర్తింపు లాంటిది. టీమ్ఇండియా తరఫున వందో టెస్టు ఆడనున్న విరాట్కు అభినందనలు. ఇది అతడి ఘనతల్లో మరొకటి. ప్రతిక్షణం అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు తహతహలాడే విరాట్కు వందో మ్యాచ్లో విజయాన్ని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాం’అని బుమ్రా మంగళవారం అన్నాడు. లంకతో శుక్రవారం ప్రారంభం కానున్న తొలి టెస్టుకు అభిమానులను అనుమతించనుండటాన్ని బుమ్రా స్వాగతించాడు. ‘ప్రేక్షకులు హాజరైతే ఆ జోష్ వేరేలా ఉంటుంది. ఊహించని శక్తి వస్తుంది. అయితే ఏదైనా నిబంధనల ప్రకారమే జరుగుతుంది. కోహ్లీకి ఇది బిగ్ మ్యాచ్. మా అందరికీ ప్రత్యేకమే’అని బుమ్రా చెప్పుకొచ్చాడు.
చెప్పా పెట్టకుండా టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీపై బీసీసీఐ కక్ష సాధిస్తుందనే వాదన అధికమవడంతో బోర్డు దిగి వచ్చింది. కరోనా వైరస్ను బూచిగా చూపిస్తూ.. విరాట్ ఆడనున్న వందో టెస్టుకు అభిమానులను అనుమతించకూడదని ముందు నిర్ణయించిన బోర్డు ఇప్పడు వెనక్కి తగ్గింది. సునీల్ గవాస్కర్ సహా పలువురు మాజీలు.. ప్రేక్షకుల సమక్షంలో చారిత్రక మ్యాచ్ సాగాలని ఆకాంక్షించగా బోర్డు దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఇక వందో టెస్టును విరాట్ మరింత చిరస్మరణీయంగా మార్చుకుంటాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ క్రికెట్లో అతికొద్ది మంది మాత్రమే వందో టెస్టులో సెంచరీ చేశారు.. ఆ జాబితాలో కోహ్లీ చేరుతాడనే నమ్మకముందని సన్నీ అన్నాడు. గత రెండేండ్లుగా అంతర్జాతీయ శతకం నమోదు చేయని విరాట్ మైలురాయి మ్యాచ్లో మూడంకెల స్కోరు సాధిస్తే అంతకన్నా అభిమానులకు కావాల్సిందేముంటుంది!