హాట్ కేకుల్లా కాంబోడియా, భారత్, ఫుట్బాల్ మ్యాచ్ టికెట్లు
కోల్కతా: ఆసియా ఫుట్బాల్ కప్ క్వాలిఫయింగ్లో భారత మ్యాచ్లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. టోర్నీలో భాగంగా ఈ నెల 8న కంబోడియాతో భారత్ మ్యాచ్ ఆడనుండగా.. కోల్కతా వేదికగా జరిగే ఈ పోరుకు సంబంధించిన 12 వేల టికెట్లను శనివారం భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) విడుదల చేసింది. అయితే పది నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి.
అంతకుముందు భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ.. ప్రత్యక్షంగా మ్యాచ్ను వీక్షించి మమ్మల్ని సపోర్ట్ చేయండి అని అభిమానులను కోరగా.. దీనికి అనూహ్య స్పందన లభించింది. కాగా.. 90 వేల మంది సామర్థ్యం గల స్టేడియంలో.. పశ్చిమ బెంగాల్లో ఎలాంటి కరోనా ఆంక్షలు లేనప్పటికీ కొద్ది మొత్తంలోనే టికెట్లు అందుబాటులో ఉంచడంపై ఛెత్రీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘సొంతగడ్డపై ఆడుతున్నప్పుడు అభిమానుల మద్దతు లభిస్తే మరింత బాగుంటుంది. 90 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం ఉన్న మైదానంలో కేవలం 15 శాతం టికెట్లే విడుదల చేస్తే ఏం ప్రయోజనం’ అని అన్నాడు.