ఆఖరి క్షణాల్లో పట్టు సడలించే అలవాటు వదులుకోని భారత పురుషుల హాకీ జట్టు.. భారీ మూల్యం చెల్లించుకుంది. ఆట ఆసాంతం ఆధిక్యంలోనే ఉన్న టీమ్ఇండియా.. చివర్లో ప్రత్యర్థికి కోలుకునే చాన్స్ ఇచ్చి చేజేతులా విజయాన్ని దూరం చేసుకుంది. హోరాహోరీగా సాగిన తొలి షూటౌట్లో ఇరు జట్లు సమంగా నిలిచినా.. రెండో షూటౌట్లో సత్తాచాటిన న్యూజిలాండ్ క్వార్టర్స్కు దూసుకెళ్లగా.. మనవాళ్లు మరోసారి రిక్తహస్తాలతో వెనుదిరిగారు.
భువనేశ్వర్: పురుషుల హాకీ ప్రపంచకప్ నుంచి భారత జట్టు నిష్క్రమించింది. గ్రూప్ దశలో చక్కటి ప్రదర్శన కనబర్చిన టీమ్ఇండియా.. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన క్రాస్ ఓవర్ మ్యాచ్లో పరాజయం పాలైంది. వరుసగా రెండోసారి స్వదేశంలో జరుగుతున్న మెగాటోర్నీలో భారత్కు నిరాశ తప్పలేదు. క్రాస్ ఓవర్ పోరు తొలుత 3-3తో సమం కాగా.. విజేతను తేల్చేందుకు షూటౌట్ నిర్వహించారు.
అందులో న్యూజిలాండ్ 5-4 తేడాతో గెలుపొందింది. ర్యాంకింగ్స్లో మనకంటే వెనుకబడి ఉన్న న్యూజిలాండ్పై భారత్ మెరుగైన ఆటతీరు కనబర్చడంలో విఫలమైంది. నిర్ణీత సమయంలో భారత్ తరఫున లలిత్ ఉపాధ్యాయ్ (17వ నిమిషంలో), సుఖ్జీత్ సింగ్ (24వ ని.లో), వరుణ్ కుమార్ (40వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. సామ్ లేన్ (28వ ని.లో), కెన్ రస్సెల్ (43వ ని.లో), సీన్ ఫిన్లే (49వ ని.లో) న్యూజిలాండ్కు గోల్స్ అందించారు. తొలి అర్ధభాగంలో ఫుల్ జోష్లో కనిపించిన భారత్ ఒక దశలో 2-0తో తిరుగులేని ఆధిక్యం కొనసాగించినా.. చివరకు ఒత్తిడికి గురై ప్రత్యర్థికి రెండు పెనాల్టీ కార్నర్లను అప్పనంగా అందించింది. షూటౌట్ సమయంలో మనవాళ్ల తప్పిదాలకు తోడు స్టార్ గోల్కీపర్ శ్రీజేశ్ గాయపడటం టీమ్ఇండియాకు ప్రతిబంధకంగా మారింది.
తొలి షూటౌట్లో ఇరు జట్లు సమంగా నిలువగా.. రెండో షూటౌట్లో పైచేయి కనబర్చిన న్యూజిలాండ్ నేరుగా క్వార్టర్స్కు చేరింది. సడెన్ డెత్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ బంతిని గోల్పోస్ట్లోకి పంపలేకపోగా.. 15 వేల మందికి పైగా అభిమానులతో కిక్కిరిసిన మైదానంలో నిశబ్దం రాజ్యమేలింది. 48 ఏండ్ల తర్వాత భారత్ కప్పు ముద్దడుతుందనుకున్న సగటు అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి. స్పెయిన్, మలేషియా మధ్య జరిగిన మ్యాచ్లో కూడా షూటౌటౌ ద్వారానే ఫలితం తేలింది. షూటౌట్లో స్పెయిన్4-3తో మలేషియాపై నెగ్గింది.