లండన్: అభిమానుల నుంచి చీదరింపులు, ఫుట్బాల్ పెద్దల నుంచి బెదిరింపులతో ఆరు ఇంగ్లిష్ క్లబ్లు వెనక్కి తగ్గాయి. యురోపియన్ సూపర్ లీగ్ నుంచి తప్పుకున్నాయి. దీంతో ప్రారంభానికి ముందే ఈఎస్ఎల్ పనైపోయినట్లు కనిపిస్తోంది. ప్రతి ఏటా కోట్లు కురిపించే ఈ లీగ్కు సై అన్న మాంచెస్టర్ యునైటెడ్, మాంచెస్టర్ సిటీ, లివర్పూల్, చెల్సీ, టోటెన్హామ్, ఆర్సెనల్ టీమ్స్ ఇప్పుడు తప్పుకున్నాయి. డర్టీ డజన్ అని ఫ్యాన్స్ చీదరించుకున్న 12 జట్ల ఈ లీగ్లో ఆరు టీమ్స్ తప్పుకోవడంతో నిర్వాహకులకు షాక్ తగిలింది.
ఈ లీగ్లో ఆడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బ్రిటన్ ప్రభుత్వంతోపాటు ఫిఫా, యూఈఎఫ్ఏ హెచ్చరించాయి. ఇందులో ఆడే ప్లేయర్స్, క్లబ్లపై నిషేధం తప్పదన్నాయి. దీంతో ఆ ఆరు ఇంగ్లిష్ క్లబ్లకు మరో మార్గం లేకపోయింది. మొదట మాంచెస్టర్ సిటీ తప్పుకోగా ఆ తర్వాత మిగిలిన ఐదు క్లబ్లు కూడా చేసేది లేక లీగ్కు నో చెప్పాయి. ఈ ఆరు తప్పుకోవడంతో ఇక లీగ్లో ఆరు స్పానిష్, ఇటాలియన్ క్లబ్లు మాత్రం మిగిలాయి. రియల్ మాడ్రిడ్, బార్సిలోనా, అట్లెటికో మాడ్రిడ్, ఏసీ మిలాన్, ఇంటర్ మిలాన్, జువెంటస్ టీమ్స్ ఇంకా లీగ్లో ఉన్నాయి.
చాంపియన్స్ లీగ్ను కాదని పోటీగా ఈ ఈఎస్ఎల్ ప్రారంభించాలని భావించారు. చాంపియన్స్ లీగ్కు ప్రతి ఏటా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. దీనికి ఆ అవసరం లేదు. ఈ 12 టీమ్స్ ప్రతి ఏటా ఆడుకోవచ్చు. భారీగా సొమ్ము చేసుకోవచ్చు అని నిర్వాహకులు ఆశ చూపారు. అయితే దీనిని ఫుట్బాల్ ఫ్యాన్స్ సహా ఆయా అథారిటీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో తప్పు చేశామని, క్షమించండని మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ చెప్పడం విశేషం. ఇప్పుడీ ఆరు క్లబ్లు తప్పుకోవడంతో లీగ్ ఫార్మాట్ను మార్చి ముందుకు తీసుకెళ్లాలని నిర్వాహకులు భావిస్తున్నారు.