న్యూఢిల్లీ: రాష్ట్ర యువ షూటర్ ఇషాసింగ్ పతకాల వేటలో దిగ్విజయంగా దూసుకెళుతున్నది. టోర్నీ ఏదైనా పతక సాధనే లక్ష్యంగా గురి పెడుతున్నది. 64వ జాతీయ షూటింగ్ చాంపియన్షిప్లో ఇషా.. పతకాల మోత మోగించింది. పిట్ట కొంచెం కూత ఘనమన్న రీతిలో 16 ఏండ్ల వయసులోనే సీనియర్లతో పోటీపడుతూ టోర్నీలో రెండు స్వర్ణాలు సహా రెండు కాంస్య పతకాలు కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల సీనియర్ 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఒలింపియన్ మనుభాకర్(241.6) పసిడి పతకం దక్కించుకోగా, శ్రీ నివేత(239.9), ఇషాసింగ్(215.4) వరుసగా రజత, కాంస్య పతకాలతో మెరిశారు. అర్హత దశలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఈ యువ హైదరాబాద్ షూటర్ 582 పాయింట్లతో టాప్లో నిలిచి ప్రధాన పోరులో పోటీపడింది. మరోవైపు 576 పాయింట్లతో ఐదో స్థానంతో సంతృప్టి పడ్డ మను భాకర్కు ఇషా దీటైన పోటీనిచ్చింది. అదే జోరు కొనసాగిస్తూ జూనియర్ ఫైనల్లో 240.7 పాయింట్లతో ఇషా..పసిడి పతకం ఒడిసిపట్టుకోగా, దేవాంశి(యూపీ), తేజస్విని(హర్యానా) రజత, కాంస్య పతకాలు ఖాతాలో వేసుకున్నారు. మహిళల యూత్ విభాగంలోనూ ఇషా స్వర్ణాన్ని గురిపెట్టింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో అంచనాలకు మించి రాణిస్తున్న ఇషాసింగ్..ఒలింపిక్స్లో పతకమే ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నది