ఐపీఎల్లో అండర్డాగ్గా బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకెళుతున్నది. సమిష్టి ప్రదర్శన కనబరుస్తూ రాజస్థాన్ రాయల్స్పై అద్భుత విజయం సొంతం చేసుకుంది. గువాహటి వేదికగా తొలిసారి జరిగిన ఐపీఎల్ పోరులో రాయల్స్పై కింగ్స్దే పైచేయి అయ్యింది. కెప్టెన్ శిఖర్ ధవన్, ప్రభ్సిమ్రన్సింగ్ అర్ధసెంచరీలతో పోరాడే స్కోరు అందుకున్న పంజాబ్.. నాథన్ ఎలీస్ విజృంభణతో రాయల్స్ పతనాన్ని శాసించింది. శాంసన్ మినహా సహచర బ్యాటర్లందరూ విఫలమైన వేళ తొలి ఓటమి చవిచూసింది.
గువాహటి: ఐపీఎల్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతున్నది. విజయం కోసం జట్లు కడదాకా కొట్లాడుతున్నాయి. బుధవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 5 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 197/4 స్కోరు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ శిఖర్ ధవన్(56 బంతుల్లో 86 నాటౌట్, 9ఫోర్లు, 3 సిక్స్లు), ప్రభ్సిమ్రన్సింగ్(34 బంతుల్లో 60, 7 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధసెంచరీలతో కదంతొక్కారు. యువ బ్యాటర్ ప్రభ్సిమ్రన్సింగ్ చూడచక్కని షాట్లతో అదరగొట్టాడు. మరోవైపు సీనియర్ ధవన్ సాధికారిక ఇన్నింగ్స్తో భారీ స్కోరుకు బాటలు వేశాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రాయల్స్ 192/7 స్కోరుకు పరిమితమైంది. కెప్టెన్ సంజూ శాంసన్(42)తో పాటు ఆఖర్లో హెట్మైర్(18 బంతుల్లో 36), ధృవ్ జురెల్(32 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు. కింగ్స్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ బౌండరీలతో విరుచుకుపడ్డారు. నాథన్ ఎలీస్(4/30) నాలుగు వికెట్లతో విజృంభించగా, అర్ష్దీప్సింగ్(2/47) ఆకట్టుకున్నాడు. ఎలీస్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
టాస్ గెలిచిన రాజస్థాన్ లక్ష్యఛేదనకు మొగ్గుచూపుతూ..పంజాబ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఇది తమకు అనుకూలంగా మలుచకున్న పంజాబ్ ఆది నుంచే రాయల్స్ బౌలర్లపై విరుచుకుపడింది. ముఖ్యంగా యువ బ్యాటర్ ప్రభ్సిమ్రన్సింగ్ సూపర్ షాట్లతో అలరించాడు. బౌలర్ ఎవరన్నది లెక్కచేయని నైజంతో దూకుడు కనబరుస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. బౌల్ట్ బౌలింగ్లో ఫోర్తో మొదలుపెట్టిన సింగ్ వెనుదిరిగి చూడలేదు. అసిఫ్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో సింగ్ చుక్కలు చూపించాడు. మూడు ఫోర్లు, ఒక భారీ సిక్స్తో 19 పరుగులు పిండుకున్నాడు. అంతటితో ఆగకుండా బౌలింగ్ మార్పుగా వచ్చిన అశ్విన్ను రెండు ఫోర్లతో అరుసుకున్నాడు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి పంజాబ్ 63 పరుగులు చేసింది. 28బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న ప్రభ్సిమ్రన్..రాయల్స్కు మరింత ప్రమాదకరంగా మారాడు. అయితే మరో ఎండ్లో ధవన్ మద్దతుగా నిలిచాడు. హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్లో బట్లర్ సూపర్ క్యాచ్తో సింగ్ నిష్క్రమించడంతో తొలి వికెట్కు 90 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. సింగ్ ఔట్ తర్వాత జోరు పెంచిన ధవన్ బౌండరీలతో చెలరేగాడు. రాజపక్స(1) రిటైర్డ్ హర్ట్గా వెనుదిరుగగా, జితేశ్శర్మ(27)తో కలిసి పరుగులు జోడించాడు. ధవన్ తన ఫామ్ను కొనసాగిస్తూ స్కోరుబోర్డుకు కీలక పరుగులు జతచేశాడు.
లక్ష్యఛేదనలో రాయల్స్కు సరిగ్గా కలిసిరాలేదు. దాదాపు పదేండ్ల తర్వాత ఓపెనర్గా బరిలోకి దిగిన అశ్విన్ డకౌట్గా వెనుదిరుగగా, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(11) తీవ్రంగా నిరాశపరిచాడు. సూపర్ఫామ్మీదున్న బట్లర్(19) వెంటనే వెనుదిరుగగా, కెప్టెన్ శాంసన్, పడిక్కల్(21) ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరు కుదురుకుంటున్న తరుణంలో ఎలీస్ బౌలింగ్లో శాంసన్ ఔట్ కావడం రాయల్స్ గెలుపు అవకాశాలను దెబ్బతీసింది. అయితే ఆఖర్లో హెట్మైర్, ధృవ్ జురెల్ రాయల్స్ను గెలిపించినంత పనిచేశారు. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీలతో చెలరేగారు. ఎలీస్ వరుస విరామాల్లో వికెట్లు తీస్తే..ఆఖరి ఓవర్లో కరాన్..రాయల్స్ బ్యాటర్లను కట్టడిచేస్తూ పంజాబ్ విజయాన్ని కట్టబెట్టాడు.
పంజాబ్: 20 ఓవర్లలో 197/4(ధవన్ 86 నాటౌట్, ప్రభ్సిమ్రన్ 60, హోల్డర్ 2/29, అశ్విన్ 1/25), రాజస్థాన్: 20 ఓవర్లలో 192/7(శాంసన్ 42, హెట్మైర్ 36, ఎలీస్ 4/30, అర్ష్దీప్సింగ్ 2/47).