న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత చెస్ బృందానికి దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ మెంటార్గా వ్యవహరించనున్నాడు. సెప్టెంబర్ 11 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ కోసం అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఆనంద్ను శనివారం మెంటార్గా ప్రకటించింది. ‘ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణ పతకాలు సాధించడమే లక్ష్యం. ఈ టోర్నీలో భారత జట్టుకు దిగ్గజ గ్రాండ్మాస్టర్ ఆనంద్ మెంటార్గా వ్యవహరిస్తాడు. మహిళలు, పురుషుల నుంచి పది మంది చొప్పున ఎంపిక చేసేందుకు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టాం’అని ఏఐసీఎఫ్ తెలిపింది.
ఆసియా క్రీడల్లో భారత్ తరఫున.. పురుషుల్లో.. తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగైసితోపాటు విదిత్ గుజరాతీ, హరికృష్ణ, నిహాల్ సరిన్, నారాయణన్, శశికిరణ్, అదిబన్, కార్తీకేయన్ మురళీ, అభిజిత్ గుప్తా, సూర్య శేఖర్ గంగూలీ ఎంపికయ్యే అవకాశం ఉంది. మహిళల జట్టులో.. కోనేరు హంపి, హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, భక్తి కుల్కర్ణి, వాంతిక అగర్వాల్, మేరీ ఆన్ గోమ్స్, సౌమ్య స్వామినాథన్, ఈషా కరవాడె పాల్గొనే అవకాశాలున్నాయి.