మెల్బోర్న్: యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్కు ఘోర పరాభవం తప్పేలాలేదు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడవ టెస్టులో ఇంగ్లండ్ ఓటమి దిశగా వెళ్తోంది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తన రెండవ ఇన్నింగ్స్లో 31 రన్స్కు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇంకా 51 రన్స్ వెనుకబడి ఉంది. రెండవ రోజు ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 267 రన్స్కు ఆలౌటైంది. హ్యారిస్ 76, వార్నర్ 38 రన్స్ చేశారు. ఇక రెండవ ఇన్నింగ్స్లోనూ ఆసీస్ బౌలర్లు చెలరేగిపోతున్నారు. మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్లు చెరో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటర్లను పెవిలియన్కు పంపించేశారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో కేవలం 82 రన్స్ ఆధిక్యాన్ని మాత్రమే సాధించింది. జేమ్స్ అండర్సన్ 33 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నారు. స్టార్క్ తన వరుస బంతుల్లో జాక్ క్రాలే, డేవిడ్ మలన్లను ఔట్ చేశాడు. ఆసీస్ బౌలర్ల ముందు ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ విలవిల మళ్లీ కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. అయిదు టెస్టుల సిరీస్లో ఇప్పటికే ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంలో ఉంది.