లండన్: ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్ట్ చివరి నిమిషంలో రద్దయిన విషయం తెలిసిందే. ఇప్పుడీ టెస్ట్ ఫలితం గురించి ఐసీసీకి అధికారికంగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) లేఖ రాసింది. ఈ మ్యాచ్పై రెండు బోర్డులు చర్చించినా.. సమస్య పరిష్కారం కాలేదని ఈ లేఖ ద్వారా స్పష్టమవుతోంది. ఈ సిరీస్లో 2-1తో టీమిండియా ఆధిక్యంలో ఉండగా.. నిర్ణాయాత్మక ఐదో టెస్ట్ కొవిడ్ కారణంగా రద్దయింది. ఇండియన్ టీమ్ బరిలోకి దిగడానికి సుముఖంగా లేదని తన ప్రకటనలో ఈసీబీ తెలిపింది. ఇక ఇప్పుడు ఈ మ్యాచ్ సంగతేంటో తేల్చాలని తాము ఐసీసీకి లేఖ రాసినట్లు ఈసీబీ అధికార ప్రతినిధి వెల్లడించారు.
ఐసీసీకి చెందిన వివాదాల పరిష్కార కమిటీ ఈ సమస్యపై దృష్టి సారించాలని ఈసీబీ కోరింది. కొవిడ్ కారణంగా ఈ మ్యాచ్ను రద్దు చేసినట్లు ప్రకటిస్తే.. అందుకు తగినట్లుగా తాము ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటామని చెప్పింది. ఈ మ్యాచ్ రద్దు కారణంగా ఈసీబీ 4 కోట్ల పౌండ్లు నష్టపోయినట్లు లేఖలో పేర్కొంది. కొవిడ్ను కారణంగా చూపుతూ మ్యాచ్ బరిలోకి నిరాకరించడాన్ని ఐసీసీ అనుమతిస్తుంది. అయితే ఇండియన్ ప్లేయర్స్ రెండు ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో నెగటివ్గా తేలినా.. ఆడకపోవడాన్ని ఈసీబీ ప్రధానంగా లేవనెత్తుతోంది.
ఒకవేళ ఐసీసీ ఈ మ్యాచ్ను రద్దు చేసినట్లు ప్రకటిస్తే.. ఇండియా 2-1తో సిరీస్ను సొంతం చేసుకుంటుంది. అదే సమయంలో ఈసీబీకి ఇది భారీ నష్టాన్ని తెచ్చి పెడుతుంది. అలా కాకుండా ఈ మ్యాచ్ నుంచి ఇండియా తప్పుకుంది కాబట్టి ఇంగ్లండ్ను విజేతగా ప్రకటిస్తే.. సిరీస్ 2-2తో సమమవుతుంది. ఈసీబీ కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ను రీషెడ్యూల్ చేద్దామన్న ప్రతిపాదనను ఈసీబీ ముందు బీసీసీఐ ఉంచినా.. రెండు బోర్డులూ దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కనిపించడం లేదు.