మెల్బోర్న్: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో ఓడిన ఇంగ్లండ్.. మూడో మ్యాచ్లోనూ నిరాశాజనక ప్రదర్శన కనబర్చింది. ఆదివారం ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (50) అర్ధశతకం నమోదు చేయగా.. బెయిర్స్టో (35), బెన్ స్టోక్స్ (25) ఫర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ పాట్ కమిన్స్, నాథన్ లియాన్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆదివారం ఆట ముగిసే సమయానికి 61/1తో నిలిచింది. విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ (38) ఔట్ కాగా.. హారిస్ (20), లియాన్ (0) క్రీజులో ఉన్నారు. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్న కంగారూలు.. ప్రత్యర్థి స్కోరుకు 124 పరుగులు వెనుకబడి ఉన్నారు.
కమిన్స్ పవర్..
సీమ్కు సహకరిస్తున్న మెల్బోర్న్ పిచ్పై ఇంగ్లిష్ ఆటగాళ్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. గత రెండు టెస్టుల వైఫల్యాలతో ఈ సారి షాట్ సెలెక్షన్పై దృష్టి పెడతామని చెప్పిన ప్లేయర్లు.. మైదానంలో దిగాక మాత్రం ఆ విషయాన్ని పక్కనపెట్టి ఎప్పుడెప్పుడు డ్రెస్సింగ్ రూమ్కు వెళ్దామా అన్నట్లు కనిపించారు. కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే హమీద్ (0) కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా.. జాక్ క్రాలీ (12), డేవిడ్ మలన్ (14) అతడిని అనుసరించారు. ఈ మూడు వికెట్లు కమిన్స్ ఖాతాలోకే వెళ్లడం విశేషం. ఈ దశలో స్టోక్స్తో కలిసి సారథి రూట్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. హాఫ్సెంచరీ అనంతరం రూట్ పెవిలియన్ చేరగా.. బెన్ స్టోక్స్, బెయిర్స్టో కూడా ఎక్కువసేపు నిలువలేకపోయారు. అప్పటి వరకు ఇంగ్లిష్ ఆటగాళ్లు క్రీజులో నిలిచేందుకు నానా తంటాలు పడ్డ చోట ఆసీస్ ఆటగాళ్లు యధేచ్చగా షాట్లు ఆడారు. ఉన్నంతసేపు మెరుపులు మెరిపించిన వార్నర్ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరినా.. ఆసీస్ మరో వికెట్ పడకుండా రోజును ముగించింది.