సుమారు ఏడేండ్ల పాటు ఇంగ్లండ్కు పరిమిత ఓవర్లలో సారథిగా సేవలందించిన ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పడంతో ఏర్పడిన ఖాళీని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పూరించింది. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు ఓపెనర్ గా వ్యవహరిస్తున్న జోస్ బట్లర్ను ఇంగ్లండ్ వన్డే, టీ20లకు కెప్టెన్ గా నియమించింది. ఈ మేరకు ఈసీబీ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.
బట్లర్ ఇన్నాళ్లు ఆ జట్టుకు వైస్ కెప్టెన్గా ఉన్న విషయం తెలిసిందే. అంతేగాక గడిచిన పదేండ్లుగా అతడు జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. తనను సారథిగా నియమించడంపై బట్లర్ హర్షం వ్యక్తం చేస్తూ ఈసీబీకి, మాజీ కెప్టెన్ మోర్గాన్కు కృతజ్ఞతలు తెలిపాడు. మోర్గాన్ నుంచి నాయకత్వ పగ్గాలు అందుకోవడం గొప్ప గౌరవమని అన్నాడు. రాబోయే సిరీస్ల కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు.
కాగా గడిచిన నాలుగు నెలల్లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో ఇది నాలుగో నియామకం. మే లో టెస్టు మాజీ కెప్టెన్ జో రూట్ను తప్పించి బెన్ స్టోక్స్ను నియమించింది ఈసీబీ. అదే నెలలో న్యూజిలాండ్ మాజీ సారథి బ్రెండన్ మెక్ కల్లమ్ను టెస్టులకు హెడ్ కోచ్గా ఎంపిక చేసింది. అంతకుముందే ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ మాట్ వన్డేలకు హెడ్ కోచ్గా వచ్చాడు. తాజాగా జోస్ బట్లర్ వన్డేలకు సారథిగా నియమితుడయ్యాడు.
ఇక 2011 నుంచి ఇంగ్లండ్కు ఆడుతున్న బట్లర్.. తన కెరీర్లో ఇప్పటివరకు 57 టెస్టులు, 151 వన్డేలు, 88 టీ20లు ఆడాడు. టెస్టులలో 2,907, వన్డేలలో 4,120, టీ20లలో 2,140 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 13 సెంచరీలు సాధించాడు. మోర్గాన్ గైర్హాజరీలో ఇంగ్లండ్కు తాత్కాలిక సారథిగా వ్యవహరించిన బట్లర్ ఇప్పుడు ఆ జట్టును పూర్తిస్థాయిలో నడిపించనున్నాడు.
The perfect man to fill those shoes 👊 pic.twitter.com/Mrio5ts7cs
— England Cricket (@englandcricket) June 30, 2022