ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో విండీస్ జట్టు చెమటోడ్చింది. తొలి ఇన్నింగ్సులో ఇంగ్లండ్ జట్టు 311 పరుగులకు ఆలౌట్ అయింది. బదులుగా విండీస్ జట్టు 375 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్లో జాక్ క్రాలీ (121) , కెప్టెన్ రూట్ (109) సెంచరీలతో అదరగొట్టడంతో 349/6 చేసిన ఆ జట్టు.. ఐదో రోజు లంచ్ ముందు ఇంగ్లండ్ జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
ఎలాగైనా విండీస్ను ఆలౌట్ చేసి మ్యాచ్ గెలవాలని ఇంగ్లండ్ ప్రయత్నించింది. కానీ 286 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన విండీస్.. గెలుపు అసాధ్యమని అర్థం చేసుకొని ఆరంభం నుంచి డ్రా కోసమే ప్రయత్నించింది. ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్వైట్, జాన్ కాంప్బెల్ ఆచితూచి ఆడుతూ లంచ్ లోపు వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.
అయితే లంచ్ తర్వాత పుంజుకున్న ఇంగ్లిష్ పేసర్లు స్టోక్స్, లీచ్ రెండు ఓవర్లలో రెండు వికెట్లు తీసుకోవడంతో.. ఆట ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత కూడా లీచ్ దూకుడు తగ్గలేదు. షామ్రా బ్రూక్స్ (5), జెర్మెయిన్ బ్లాక్వుడ్ (2)ను పెవిలియన్ చేర్చాడు. అయితే నిక్రుమా బోనర్ (38 నాటౌట్), జేసన్ హోల్డర్ (37 నాటౌట్) మరో వికెట్ తీసే ఛాన్స్ ఇంగ్లండ్ బౌలర్లకు ఇవ్వలేదు.
దీంతో మరో ఐదు బంతులు వేస్తే మ్యాచ్ ముగుస్తుందనగా.. ఇంగ్లండ్ కెప్టెన్ రూట్.. డ్రాకు అంగీకరిస్తూ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దీంతో మూడు మ్యాచుల టెస్టు సిరీస్ 0-0తో సమానంగా నిలిచింది. రెండో టెస్టు 16వ తేదీ నుంచి బార్బడోస్లో మొదలవుతుంది.