ENG vs AUS | యాషెస్ సిరీస్లో మూడో టెస్టు కోసం ఇంగ్లండ్ జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు గురువారం (జులై 6) నుంచి హెడింగ్లీ (లీడ్స్)లో మొదలుకానున్నది. ప్రస్తుతం ఈ సిరీస్లో ఇంగ్లండ్ 0-2తో వెనుకంజలో ఉంది. మూడో టెస్టులో ఓడినా.. లేదంటే మ్యాచ్ డ్రాగా ముగిసినా యాషెస్ కప్ ఆస్ట్రేలియాకే దక్కుతుంది. ఈ పరిస్థితుల్లో యాషెస్ను కాపాడుకునేందుకు తప్పనిసరిగా మూడో టెస్టులో తప్పక గెలవాల్సిన పరిస్థితి.
ఈ క్రమంలో మూడోటెస్టు కోసం జట్టును ప్రకటించిన బోర్డు.. సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్తో పాటు యువ ఫాస్ట్ బౌలర్ జోష్ టంగ్పై వేటు వేసింది. అదే సమయంలో వైస్ కెప్టెన్ ఒలీపోప్ గాయం కారణంగా మొత్తం సిరీస్కు దూరమయ్యాడు. ముగ్గురి ప్లేస్లో క్రిస్ వోక్స్, మార్క్వుడ్, మొయిన్ అలీని తిరిగి జట్టులోకి తీసుకున్నది. అండర్సన్ చివరి రెండు టెస్టుల్లో మూడు వికెట్లను మాత్రమే తీయగలిగాడు. ఇదిలా ఉండగా మార్క్వుడ్ ఇప్పటి వరకు ఇంగ్లండ్ తరఫున 28 టెస్టులు ఆడాడు. మొత్తం 90 వికెట్లు తీశాడు. చివరిసారిగా ఇంగ్లండ్ తరఫున డిసెంబర్ 2022లో పాక్తో టెస్ట్ మ్యాచ్ ఆడాడు.
ఇక క్రిస్ వోక్స్ ఏడాది తర్వాత మ్యాచ్ ఆడబోడుతున్నాడు. చివరిసారిగా మార్చి 2022లో వెస్టిండిస్తో జరిగిన మ్యాచ్లో కనిపించాడు. వోక్స్ 45 టెస్టుల్లో 130 వికెట్లు పడగొట్టాడు. సెంచరీ సహాయంతో 1,675 పరుగులు కూడా చేశాడు. మరో వైపు ఒలీపోప్ భుజం గాయం కారణంగా సిరీస్కు దురయ్యాడు. అతని ప్లేస్లో మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్కు దిగుతారనే ప్రశ్నార్థకంగా మారింది. ఇంగ్లండ్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ను జట్టులోకి తీసుకోకపోవడంతో హ్యారీ బ్రూక్ను మూడో స్థానంలో బ్యాటింగ్కు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
జాక్ క్రాలీ, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్ (సీ), మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, ఒలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్.