ముగిసిన జాతీయ సబ్ జూనియర్ హ్యాండ్బాల్ టోర్నీ
హైదరాబాద్: జాతీయ సబ్జూనియర్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో తెలంగాణ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన హోరాహోరీ ఫైనల్లో తెలంగాణ 29-26తో రాజస్థాన్ను చిత్తు చేసి టైటిల్ కైవసం చేసుకుంది. సరూర్ నగర్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో 25 రాష్ర్టాల జట్లు పాల్గొనగా.. ముగింపు వేడుకలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ‘కరోనా మహమ్మారి వల్ల ఏడాదిన్నర కాలంగా ఒక్క జాతీయ స్థాయి టోర్నీకీ ఆతిథ్యమివ్వని హైదరాబాద్కు ఈ టోర్నీ పండుగ శోభ తెచ్చింది. క్రీడల్లో రాణించడం ద్వారా రాష్ర్టానికి దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక క్రీడలకు అధిక ప్రాధన్యత లభిస్తున్నది. మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది’ అని అన్నారు. వచ్చే ఏడాది హైదరాబాద్ వేదికగా ఆసియా హ్యాండ్బాల్ చాంపియన్షిప్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామని జాతీయ హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్రావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ టూరిజం కల్చర్ కార్యదర్శి కె.ఎస్.శ్రీనివాసరాజు, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, ఐఓఏ కోశాధికారి ఆనందీశ్వర్ పాండే, కార్యదర్శి పవన్ తదితరులు పాల్గొన్నారు.