ECB : తాలిబన్ల ప్రభుత్వ ఆంక్షలతో విదేశాల్లో తలదాచుకున్న అఫ్గనిస్థాన్(Afghanistan) మహిళా క్రికెటర్లకు శుభవార్త. శరణార్ధులుగా పరాయి దేశంలో ఉంటూనే క్రికెట్పై ఆశ వదులుకోని వీరిని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) తమ దేశానికి ఆహ్వానించింది. త్వరలోనే అఫ్గనిస్థాన్ శరణార్ధుల జట్టుకు టీ20 మ్యాచ్లతో పాటు ఉన్నత స్థాయి శిక్షణ శిబిరాన్ని ఈసీబీ నిర్వహించనుంది. మెరిల్బోన్ క్రికెట్ క్లబ్, ఎంసీసీ సంస్థ భాగస్వామ్యంతో ఇంగ్లండ్ బోర్డు అఫ్గన్ మహిళా క్రికెటర్లకు మెలకువలు నేర్పనుంది.
‘జీవితంలో మళ్లీ మేము క్రికెట్ ఆడుతామా.. ఆ అవకాశం వస్తుందా’ అనే సందిగ్ధంతోనే కాలం వెళ్లదీస్తున్న అఫ్గనిస్థాన్ మహిళా క్రికెటర్లకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కొత్త జవసత్వాలను ఇవ్వనుంది. ఐసీసీ చొరవతో నిరుడు వన్డే ప్రపంచకప్ ఫైనల్ వీక్షించిన అఫ్గన్ శరణార్ధుల జట్టు సభ్యులకు తమ దేశంలో టీ20 మ్యాచ్లు ఆడించనుంది ఈసీబీ. అనంతరం వీరికి అత్యున్నత శిక్షణ ఇవ్వనుంది. అంతేకాదు జూలై 5న లార్డ్స్ మైదానంలో జరుగనున్న మహిళల పొట్టి ప్రపంచకప్ ఫైనల్ను అఫ్గన్ క్రికెటర్లు వీక్షించనున్నారు.
ECB to host Afghan Refugee Women’s Team for ground-breaking tour ⬇️https://t.co/75a0IL6JvJ
— England and Wales Cricket Board (@ECB_cricket) May 21, 2026
‘2021లో సొంత నేలను వదిలి పలు దేశాలకు శరణార్ధులుగా వెళ్లిన అఫ్గనిస్థాన్ మహిళా క్రికెటర్లు.. ఆటను మాత్రం వదల్లేదు. కఠినమైన పరిస్థితులు ఎదురైన వీరు క్రికెట్ను కొనసాగించారు. కాబట్టి. వీరి ఆట మరింత మెరుగయ్యేందుకు సాయపడాలనుకుంటున్నాం. అఫ్గన్ స్క్వాడ్ పొట్టి ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కు హాజరవుతారు’ అని ఇంగ్లండ్ బోర్డు డిప్యూటీ సీఈవో, ఎండీ క్లారే కొన్నోర్ పేర్కొంది.

అఫ్గనిస్థాన్లో 2021లో తాలిబన్ల రాజ్యం ఏర్పడింది. మహిళలపై ఆంక్షల భయాలతో.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విదేశాలకు వెళ్లిన మహిళా క్రికెటర్లు.. పలు దేశాల్లో శరణార్దులుగా జీవిస్తున్న విషయం తెలిసిందే.