బెంగళూరు: ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో హైదరాబాదీ తిలక్ వర్మ కెప్టెన్సీలోని సౌత్ జోన్ ఫైనల్ చేరింది. బుధవారం ముగిసిన రెండో సెమీస్లో 7 వికెట్ల తేడాతో నార్త్జోన్ను ఓడించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 182 పరుగుల లక్ష్య ఛేదనను ఆ జట్టు 43.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన కెప్టెన్ తిలక్ (79 బంతుల్లో 8 ఫోర్లతో 51 నాటౌట్) అర్ధశతకానికి తోడు జగదీశన్ (43), రిక్కీ భుయ్ (42), స్మరణ్ (32 నాటౌట్) రాణించారు. ఆఫ్సైడ్లో చూడచక్కని షాట్లు ఆడిన తిలక్ స్పిన్నర్ల బౌలింగ్లో రివర్స్ స్వీప్, ప్యాడిల్ స్వీప్ షాట్లతో అలరించాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్కు చేరడం సౌత్జోన్కు ఇది 24వ సారి కావడం గమనార్హం. ఈనెల 6 నుంచి చెన్నై వేదికగా జరిగే ఫైనల్లో సౌత్ జోన్.. ఈస్ట్జోన్తో అమీతుమీ తేల్చుకోనుంది.
టెస్టులే ఇష్టం: తిలక్
భారత టీ20 వైస్ కెప్టెన్గా ఉన్న తిలక్ వర్మ.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనే జాతీయ జట్టుకు ఆడుతున్నా తనకు టెస్టులంటేనే మక్కువ ఎక్కువని అన్నాడు. దులీప్ ట్రోఫీ సెమీస్ మ్యాచ్ ముగిశాక అతడు మాట్లాడుతూ.. ‘నేను భారత జట్టుకు పరిమిత ఓవర్లలో ఆడతానని ఎప్పుడూ ఊహించలేదు. అది దైవ నిర్ణయం. కానీ నాకు రెడ్ బాల్ క్రికెట్ ఆడటమంటేనే ఇష్టం. నా బలం ఎప్పుడూ టెస్టులే. ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేసి టీమిండియాలో టీ20 జట్టులోకి వచ్చా. కానీ అంతకంటే ముందు చాలా రోజులు నేను దేశవాళీలో రెడ్బాల్ క్రికెట్ ఆడా. అది నా రక్తంలోనే ఉంది. పరిమిత ఓవర్ల నుంచి టెస్టులకు మారడం నాకు చాలా తేలిక’ అని చెప్పాడు. టెస్టుల్లో జాతీయ జట్టుకు ఆడాలని ఉందని ఈ సందర్భంగా తిలక్ ఆశాభావం వ్యక్తం చేశాడు.