టోక్యో: ఒలింపిక్స్లో పోడియంపై నిల్చొని అక్కడి ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య మెడలో మెడల్ వేస్తుంటే అథ్లెట్లు గర్వంతో ఉప్పొంగిపోతారు. ఎవరో ఒక ప్రముఖుడు ఈ మెడల్స్ను అందించడం ఆనవాయితీ. అయితే ఈసారి మాత్రం కరోనా కారణంగా మెడల్ సెర్మనీ కూడా చాలా సింపుల్గా నిర్వహించనున్నారు. ఈసారి ఎవరి మెడల్స్ వాళ్లే మెడలో వేసుకోవాలని నిర్వాహకులు స్పష్టం చేశారు. హ్యాండ్షేక్స్, హగ్స్ కూడా ఉండవు. ఓ ట్రేలో మెడల్స్ తీసుకొని వస్తే.. పోడియంపై ఉన్న అథ్లెట్లు వాటిని తీసుకొని మెడలో వేసుకోవాలి.
ఈసారి గేమ్స్లో మెడల్స్ను మెడలో వేయబోవడం లేదని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్ కూడా స్పష్టం చేశారు. మెడల్స్ను ట్రేలో పెట్టే ముందు కూడా చేతులకు గ్లోవ్స్ వేసుకుంటారు. వాటిని ఇచ్చేవాళ్లు, అథ్లెట్లు కూడా మాస్కులు వేసుకుంటారు. హ్యాండ్షేక్స్, హగ్స్లాంటివి ఏమీ ఉండవు అని బాక్ తేల్చి చెప్పారు. ఈ గేమ్స్కు ఆతిథ్యమిస్తున్న టోక్యోలో ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించారు. అక్కడ బుధవారం 1149 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరు నెలల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.