మెల్బోర్న్: ఆస్ట్రేలియా వీసా రద్దు కేసులో టెన్నిస్ స్టార్ జోకోవిచ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ మరో కొత్త విషయాన్ని జోకో చెప్పాడు. తన ట్రావెల్ పేపర్స్లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చానని, తొందరలో ఆ పొరపాట్లు జరిగినట్లు వెల్లడించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు మెల్బోర్న్ వచ్చిన జోకోవిచ్ను డిటెన్షన్ హోటల్లో పెట్టిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా ప్రభుత్వానికి తమ బృందం తాజా సమాచారాన్ని ఇచ్చినట్లు జోకో తన ఇన్స్టాలో తెలిపాడు. వీసా రద్దు కేసులో జోకోకు కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా.. అతని వీసాను రద్దు చేయాలన్న ఆలోచనలో ఆ దేశ ఇమ్మిగ్రేషన్ శాఖ ఉంది. ఈ నేపథ్యంలో జోకోవిచ్ మరో సారి వివరణ ఇచ్చాడు. కరోనా మహమ్మారి వేళ.. చాలా విపత్కర సమయాన్ని ఎదుర్కొంటున్నామని, కొన్ని సందర్భాల్లో పొరపాట్లు జరుగుతుంటాయని జోకో అన్నాడు. వ్యాక్సిన్ తీసుకోని కారణంగా.. జోకోకు ఎలా మినహాయింపు ఇస్తారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా జోకో కేసు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మరో వైపు ఆస్ట్రేలియాలో ఇంకా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
డిసెంబర్ 16వ తేదీ పీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వచ్చినా.. అతను ఆస్ట్రేలియాకు వచ్చాడు. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తికి ఎలా మినహాయింపు ఇస్తారని బోర్డర్ ఏజెంట్లు అతని దరఖాస్తును తిప్పికొట్టారు. ఇన్ఫెక్షన్ సమయంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు వస్తున్న సమాచారంలో తప్పు ఉన్నట్లు జోకో తెలిపాడు. అయితే పలు కార్యక్రమాలు హాజరైన తర్వాత తనకు పీసీఆర్ పరీక్ష ఫలితం అందినట్లు వెల్లడించాడు. పాజిటివ్గా ఉన్న సమయంలో ఫ్రాన్స్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చినట్లు తెలిపాడు. జర్నలిస్టులను మనస్తాపానికి గురిచేయవద్దు అన్న ఆలోచనతో ఆ ఇంటర్వ్యూ ఇచ్చినట్లు వెల్లడించాడు. ఈ అంశంలో పొరపాటు జరిగిందని, ఆ ఇంటర్వ్యూను రీషెడ్యూల్ చేస్తే బాగుండేదన్న అభిప్రాయాన్ని అతను వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా రావడానికి 14 రోజుల ముందు ఎక్కడికీ వెళ్లలేదని ట్రావెల్ డిక్లరేషన్లో జోకో వెల్లడించాడు. అయితే ఆ దరఖాస్తును తాను నింపలేదని, తన తరపున తన బృందం ఆ సమాచారాన్ని ఇచ్చినట్లు అంగీకరించాడు. దానికి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపాడు.