మస్కట్: ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో భారత టైటిల్ ఆశలకు గండిపడింది. ఎలాగైనా ట్రోఫీని నిలబెట్టుకోవాలని బరిలోకి దిగిన టీమ్ఇండియాకు భంగపాటు ఎదురైంది. బుధవారం రసవత్తరంగా సాగిన సెమీ ఫైనల్లో భారత్ 2-3 తేడాతో కొరియా చేతిలో ఓటమిపాలైంది. మూడు, నాలుగు స్థానాల కోసం శుక్రవారం జరిగే వర్గీకరణ మ్యాచ్లో అమ్మాయిలు బరిలోకి దిగనున్నారు. మ్యాచ్ విషయానికొస్తే భారత్ తరఫున వందనా కటారియా (28ని), లాల్రెమిసియామి (54ని) గోల్స్ చేయగా, చియోన్(31ని), సెంగ్జు లీ(45ని), హైజిన్ చో (47ని) కొరియాకు గోల్స్ అందించారు. మ్యాచ్ తొలి క్వార్టర్లో టీమ్ఇండియా ఆధిపత్యం ప్రదర్శించినా.. కీలకమైన ద్వితీయార్థంలో కొరియా అద్భుతంగా పుంజుకుంది. భారత డిఫెన్స్కు పరీక్ష పెడుతూ గోల్పోస్ట్పై మెరుపు దాడులకు పాల్పడింది. ప్రత్యర్థి దాడులను నిలువరించడంలో గోల్కీపర్ సవిత ఒకింత సఫలమైనా.. లాభం లేకపోయింది.