ముంబై: క్రికెట్ ప్రపంచకప్-2023లో భాగంగా నవంబర్ 6న ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆఫ్ఘన్ టీమ్.. చివరకు ఆసీస్ జట్టు అనుభవం ముందు తేలిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 291 పరుగులు చేసింది. అనంతరం 292 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ టీమ్ ఆఫ్ఘన్ బౌలింగ్ ధాటికి బెంబేలెత్తింది. జట్టు స్కోర్ 90 పరుగులకు చేరుకునే లోపే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ఆఫ్ఘన్ గెలుపు ఖాయమే అనిపించింది. కానీ ఆ తర్వాత మాక్స్వెల్ ధాటికి ఆఫ్ఘన్ టీమ్ విలవిల్లాడింది. ఆసీస్ మరో వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించింది. మాక్స్వెల్ 201 పరుగులతో అజేయంగా నిలిచాడు.
అయితే, ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మాక్స్వెల్ భారత క్రికెట్ దిగ్గజం కాళ్లకు నమస్కరించినట్లుగా ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ ఫొటో వైరల్ అయ్యింది. మ్యాచ్ అనంతరం మాక్స్వెల్ను అభినందించేందుకు సచిన్ మైదానంలోకి వెళ్లగా అతను మాస్టర్బ్లాస్టర్ కాళ్లపై పడినట్లు ప్రచారం జరుగుతున్నది. మరి నిజంగానే మాక్స్వెల్.. సచిన్ టెండూల్కర్ కాళ్లపై పడ్డాడా..? అంటే కాదనే స్పష్టమైంది. సచిన్ కాళ్లకు మాక్స్వెల్ మొక్కుతున్నట్టుగా ఉన్న ఆ ఫొటోను ఫొటోషాప్ ద్వారా సృష్టించినట్లు వెల్లడైంది. అసలు ఆఫ్ఘన్-ఆస్ట్రేలియా మ్యాచ్ నాడు సచిన్ వాంఖడే స్టేడియానికే వెళ్లలేదని తేలింది.