MS Dhoni in IPL | మిస్టర్ కూల్.. మహేంద్ర సింగ్ ధోనీ.. టీం ఇండియా మాజీ సారధి. ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. చెన్నై సూపర్ కింగ్స్, మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్ షాక్కు గురయ్యారు. 14 ఏండ్లుగా సీఎస్కే టీం సారధిగా ఉన్న మిస్టర్ కూల్.. ధోనీ కెప్టెన్సీ వదులుకోవడానికి కారణమేమిటి? మహేంద్రుడికి ఈ సీజన్ చివరి టోర్నీ అవుతుందా..? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. ధోనీకిది చివరి టోర్నీ కావచ్చునని ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎస్కే అధికారి చెప్పారు. కానీ దీన్ని ఐపీఎల్ చెన్నై మేనేజ్మెంట్ పరిగణనలోకి తీసుకోలేదని, ధోనీకి ప్రత్యామ్నాయం తయారు చేయడమే లక్ష్యంగా ముందుకెళుతుందన్నారు.
సీఎస్కే నూతన సారధిగా రవీంద్ర జడేజాను ధోనీ ప్రతిపాదించారని సమాచారం. దీన్ని ఫ్రాంచైసీ యాజమాన్యం ఆమోదించినట్లు తెలుస్తున్నది. రవీంద్ర జడేజా ఆల్రౌండర్గా ఎదగడంతోపాటు ఐపీఎల్ టోర్నీలో రెండేండ్లుగా మెరుగైన ఆటతీరు ప్రదర్శించడమే కారణమని సమాచారం. జడేజాను కొనసాగించడంతోనే కెప్టెన్ను మార్చనున్నట్లు సంకేతాలిచ్చారు. రవీంద్ర జడేజాను రూ.16 కోట్లకు, ధోనీని రూ.12 కోట్లకు సీఎస్కే కొనసాగిస్తున్నది.
దాదాపు ఐపీఎల్లోని ఫ్రాంచైసీలన్నీ యువతపైనే ఎక్కువ ఫోకస్ చేశాయి. ఈ దఫా టోర్నీలో 10 జట్లు ఆడబోతున్నాయి. ఈ జట్లలోని కెప్టెన్ల వయస్సు 37 ఏండ్ల లోపే. ఐదు టీంల సారధి వయస్సు 30, నలుగురు కెప్టెన్ల వయస్సు 35 ఏండ్లు, 35 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు ఒకరు నియమితులయ్యారు. రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు (ఆర్సీబీ) సారధిగా డూప్లెసిస్ బాధ్యతలు చేపట్టారు. చెన్నై సారధి జడేజా వయస్సు 33 ఏండ్లు. యువ సారధి ట్రెండ్ను అనుసరించాలని సీఎస్కే నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది.
సీఎస్కే టీం ఆటతీరు మెరుగ్గానే ఉన్నా.. మిస్టర్ కూల్ ప్రదర్శనలో పాటవం తగ్గుతున్నది. 14 ఏండ్లలో సీఎస్కే 9 సార్లు ఫైనల్స్కు దూసుకెళితే నాలుగు టైటిళ్లను సొంతం చేసుకుంది. గతేడాది (2021) టైటిల్ను కూడా సీఎస్కే గెలుచుకుంది. కానీ రెండేండ్లుగా ధోనీ పెర్పార్మెన్స్ చాలా పేలవంగా ఉంది. 2020లో 14 మ్యాచ్ల్లో కేవలం 200 పరుగులు, 2021లో 16 మ్యాచ్ల్లో 114 పరుగులకే పరిమితమయ్యాడు. గతేడాది ధోనీ సగటు పరుగులు 16.29 మాత్రమే.
సీఎస్కేకు మెంటర్ అవసరం అని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు. ఇంతకుముందు నాలుగో, ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చే ధోనీ.. గత సీజన్లో 6వ, 7వ ప్లేస్లో బ్యాటింగ్కు దిగాడని గంభీర్ గుర్తు చేశాడు. తనకంటే ముందే జడేజాను బ్యాటింగ్కు పంపేవాడు. ప్రణాళిక ప్రకారమే ధోనీ ముందుకెళ్తున్నారన్నాడు. 2021 టీ-20 వరల్డ్ కప్లో ఇదే ప్లాన్ ధోనీ అమలు చేశాడని గంభీర్ చెప్పాడు. సారధిగా రాజీనామా చేసి, తనకు తాను జట్టుకు మెంటర్ కావాలని సిద్ధమవుతున్నాడన్నారు.
వయస్సు, ఆటలో పూర్ పెర్పార్మెన్స్ తదితర పరిస్థితుల దృష్ట్యా ధోనీకి 2022 ఐపీఎల్ టోర్నీ చివరి సీజన్ అని భావిస్తున్నారు. కానీ సీఎస్కే జట్టుతో ధోనీ తన అనుబంధాన్ని కొనసాగిస్తాడంటున్నారు. అయితే, జట్టులో ఆయన పాత్రేమిటో ఇంకా వెల్లడి కాలేదు. ఇప్పటివరకు తన కెరీర్లో షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్న ధోనీ గురించి ఖచ్చితంగా చెప్పాలంటే కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
సీఎస్కే ఫ్రాంచైసీ ఆల్రౌండర్ను కెప్టెన్గా ఎంపిక చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నది. ఇప్పటికే ఆల్రౌండర్గా ఉన్న జడేజాను ఎంపిక చేయడంలో అంతరార్థం ఇదే. జడేజా జట్టుకు గేమ్ ప్లాన్, స్ట్రాటర్జీ ట్రైనింగ్ ప్లాన్ ఇస్తాడు. అయితే వయస్సు రీత్యా రవీంద్ర జడేజా ఒక్కడే సీఎస్కే ఆప్షన్ కాదు.. రితురాజ్ గైక్వాడ్కు సారధిగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.