ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఒకటి. ఈ జట్టుకు భారత మాజీ సారధి, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్లో తను కెప్టెన్సీ నుంచి తప్పుకొని స్టార్ ఆల్రౌండర్ జడేజాకు ఈ బాధ్యతలు అప్పజెప్పాడు. ఈ ప్లాన్ వర్కవుట్ కాలేదు. సీఎస్కే వరుసగా మ్యాచులు ఓడిపోతూ వచ్చింది. దీంతో జడ్డూను కెప్టెన్సీ నుంచి తప్పించి మళ్లీ ధోనీకే పగ్గాలు అప్పగించింది జట్టు యాజమాన్యం.
ఆ తర్వాత గాయంతో జడ్డూ ఈ టోర్నీకి దూరమయ్యాడు కూడా. ఇలాంటి సమయంలో వచ్చే ఏడాది సీఎస్కేకు కెప్టెన్సీ ఎవరు చేస్తారనే ప్రశ్న తలెత్తింది. దీనికి తాజాగా సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ సమాధానం చెప్పారు. వచ్చే ఏడాది కూడా ధోనీనే జట్టుకు నాయకత్వం వహిస్తాడని ఆయన తేల్చేశారు. ‘‘మా మాటలో ఎలాంటి మార్పూలేదు. అసలు కెప్టెన్సీ మార్పు ఉంటుందని మేం ఎప్పుడు చెప్పాం?’’ అని అడిగారు. ధోనీ కూడా దీని గురించి గతంలో మాట్లాడుతూ.. చెన్నైలో చివరగా ఆడి అభిమానులకు ధన్యవాదాలు చెప్పకుండా తప్పుకోవడం సరికాదన్నాడు.