ముంబై: తాజా ఐపీఎల్ సీజన్లో బోణీ కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్.. దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. పేస్ విభాగం బలహీనంగా ఉండటంతో గెలుపు బాట పట్టలేకపోతున్న ముంబై.. దేశవాళీ పేసర్ ధవల్ కులకర్ణిని జట్టులోకి తీసుకుంది. ఇప్పటి వరకు సీజన్లో ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో స్టార్ పేసర్ బుమ్రా ఐదు వికెట్లే పడగొట్టగా.. ఉనాద్కట్ (6 వికెట్లు), డానియల్ సామ్స్ (6 వికెట్లు), మిల్స్ (6 వికెట్లు), బాసిల్ థంపీ (5 వికెట్లు) మెరిడిత్ (3 వికెట్లు) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో మంచి రికార్డు ఉన్న కులకర్ణిని టీమ్లోకి తీసుకుంది. ముంబై బయో బబుల్లో చేరిన కులకర్ణి ట్రైనింగ్ సెషన్స్లో ఆకట్టుకుంటే అతడిని తుది జట్టులోకి తీసుకోవాలని యోచిస్తున్నది. 33 ఏండ్ల ధవల్ ఐపీఎల్లో రాజస్థాన్, ముంబై, గుజరాత్ జట్లకు ప్రాతినిధ్యం వహించి ఇప్పటి వరకు 92 మ్యాచ్ల్లో 86 వికెట్లు పడగొట్టాడు.