ఐపీఎల్ పదిహేనో సీజన్లో పడుతూ లేస్తూ సాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ సరైన సమయంలో విజృంభించింది. ప్లే ఆఫ్స్కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో పంజాబ్ కింగ్స్పై పూర్తి ఆధిపత్యం కనబర్చింది. మొదట బ్యాటింగ్లో మిషెల్ మార్ష్ రాణించడంతో మంచి స్కోరు చేసిన ఢిల్లీ.. ఆనక బౌలింగ్లో శార్దూల్ ఠాకూర్ చెలరేగడంతో కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఇక ముంబైతో జరుగనున్న చివరి మ్యాచ్లో గెలిస్తే ఢిల్లీ దాదాపుగా ప్లే ఆఫ్స్ చేరినట్లే! మరోవైపు ఈ పరాజయం పంజాబ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసింది. ప్రస్తుతానికి పంజాబ్ సాంకేతికంగా మాత్రమే రేసులో ఉంది!!
ముంబై: సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన ఢిల్లీ క్యాపిటల్స్ కీలక సమయంలో అత్యవసర విజయంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగు పర్చుకుంది. ముందంజ వేయాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో సోమవారం ఢిల్లీ 17 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ను చిత్తు చేసింది. 13 మ్యాచ్ల్లో ఏడో విజయంతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఢిల్లీ రన్రేట్ మెరుగ్గా ఉండటంతో పట్టికలో నాలుగో స్థానానికి చేరగా.. పంజాబ్ నామమాత్రంగా మాత్రమే రేసులో మిగిలింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. మిషెల్ మార్ష్ (48 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా.. సర్ఫరాజ్ ఖాన్ (16 బంతుల్లో 32; 5 ఫోర్లు, ఒక సిక్సర్) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు.
రెండో వికెట్కు సర్ఫరాజ్తో కలిసి 51 పరుగులు జతచేసిన మార్ష్.. లలిత్ యాదవ్ (24)తో మూడో వికెట్కు 47 రన్స్ జోడించాడు. పంజాబ్ బౌలర్లలో లియామ్ లివింగ్స్టోన్, అర్శ్దీప్ సింగ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ (0) ఇన్నింగ్స్ తొలి బంతికే రాహుల్ చాహర్కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్గా వెనుదిరగగా.. కెప్టెన్ రిషబ్ పంత్ (7), రావ్మన్ పావెల్ (2) విఫలమయ్యారు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు చేసింది. వరుస బౌండ్రీలతో బెంబేలెత్తించిన జానీ బెయిర్స్టో (15 బంతుల్లో 28; 4 ఫోర్లు, ఒక సిక్సర్)ను నోర్జే ఔట్ చేయగా.. శిఖర్ ధవన్ (19), భానుక రాజపక్స (4), లివింగ్స్టోన్ (3), మయాంక్ అగర్వాల్ (0), హర్ప్రీత్ బ్రార్ (1), రిషి ధవన్ (4) పెవిలియన్కు క్యూ కట్టారు. జితేశ్ శర్మ (34 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రాహుల్ చాహర్ (25 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. శార్దూల్ ఠాకూర్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా మంగళవారం ముంబైతో హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది.
ఢిల్లీ: 20 ఓవర్లలో 159/7 (మార్ష్ 63, సర్ఫరాజ్ 32; లివింగ్స్టోన్ 3/27, అర్శ్దీప్ 3/37), పంజాబ్: 20 ఓవర్లలో 142/9 (జితేశ్ 44, బెయిర్స్టో 28; శార్దూల్ 4/36, అక్షర్ 2/14).