నేవి ముంబై: ఐపీఎల్ ప్లేఆఫ్ రేసులో ఢిల్లీ క్యాపిటల్స్ తాము ఉన్నామని చాటి చెప్పింది. గెలిస్తేనే నిలుస్తామన్న క్లిష్ట పరిస్థితుల మధ్య బరిలోకి దిగిన ఢిల్లీ..రాజస్థాన్ రాయల్స్ ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో రాయల్స్పై ఘన విజయం సాధించింది. దీని ద్వారా ఆడిన 12 మ్యాచ్ల్లో ఆరు విజయాలు, ఆరు ఓటములతో 12 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది.
మరోవైపు గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుందామనుకున్న రాయల్స్ మిగిలిన రెండు మ్యాచ్ల్లో తప్పక గెలువాల్సిన పరిస్థితి కొనితెచ్చుకుంది. మ్యాచ్ విషయానికొస్తే తొలుత అశ్విన్(38 బంతుల్లో 50, 4ఫోర్లు, 2 సిక్స్లు), దేవదత్ పడిక్కల్(48) రాణించడంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 160/6 స్కోరు చేసింది. వీరిద్దరు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. మిచెల్ మార్ష్(2/25), చేతన్ సకారియా(2/23), నోర్జె(2/39) రెండేసి వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ..18.1 ఓవర్లలో 161/2 స్కోరు చేసింది.
ఓపెనర్ శ్రీకర్ భరత్(0)మరోమారు నిరాశపరుచగా, మిచెల్ మార్ష్(62 బంతుల్లో 89, 5ఫోర్లు, 7 సిక్స్లు), వార్నర్(41 బంతుల్లో 52 నాటౌట్, 5ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో ఢిల్లీ అలవోక విజయాన్నందుకుంది. భరత్ వికెట్ మినహా రాయల్స్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. మార్ష్, వార్నర్..రాజస్థాన్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. దీనికి తోడు పేలవ ఫీల్డింగ్ రాజస్థాన్ కొంపముంచింది. బౌల్ట్, చాహల్కు ఒక్కో వికెట్ దక్కాయి. ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టును గెలిపించిన మార్ష్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. గురువారం చెన్నై, ముంబై తలపడుతాయి.
సంక్షిప్త స్కోర్లు
రాజస్థాన్: 20 ఓవర్లలో 160/6 (అశ్విన్ 50, పడిక్కల్ 48, మార్ష్ 2/25, నోర్జె 2/39, సకారియా 2/23), ఢిల్లీ: 18.1 ఓవర్లలో 161/2 (మార్ష్ 89, వార్నర్ 52 నాటౌట్, బౌల్ట్ 1/32, చాహల్ 1/43)