ప్రస్తుతం ఐపీఎల్ తాజా సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా ఇద్దరూ అదరగొడుతున్నారు. వీళ్లిద్దరూ కలిసి ఇప్పటి వరకు నాలుగు మ్యాచుల్లో ఆ జట్టుకు శుభారంభాలు అందించారు. ఆడిన నాలుగు మ్యాచుల్లో వరుసగా 67, 93, 50, 83 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పారు. అయితే ఢిల్లీ మిడిలార్డర్ కూడా రాణించాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ‘‘స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్కు ఏమాత్రం తీసిపోకుండా పృథ్వీ షా ఆడుతున్నాడు’’ అని చెప్పాడు.
అయితే ఢిల్లీ మిడిలార్డర్ కూడా ఇలాగే ఫైర్ అయితే ఆ జట్టు సులభంగా ప్లేఆఫ్స్ చేరుతుందని అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్పై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘గడిచిన రెండు, మూడు ఐపీఎల్ సీజన్లను గమనిస్తే.. పంత్ ఎప్పుడూ నిలకడగా రాణించలేదు. కానీ ముఖ్యమైన మ్యాచుల్లో అదరగొట్టాడు. గత మ్యాచ్లో అవకాశం రాలేదు కానీ.. అంతకుముందు మ్యాచులో 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. కాబట్టి పంత్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక నుంచి జరిగే కీలకమైన మ్యాచుల్లో అతను ఆడితే చాలు’’ అని విశ్లేషించాడు.