IPL-2023 | భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2023)కి అందుబాటులో ఉండడం లేదని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించారు. రిషబ్ డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెగాటోర్నీలో ఆడబోవడం లేదని గంగూలీ పేర్కొన్నారు. గంగూలీ త్వరలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అలాగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టీం దుబాయి క్యాపిటల్స్, ఎస్ఏ టీ20 టీం ప్రిటోరియా క్యాపిటల్స్కు డైరెక్టర్గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రిషబ్ కెప్టెన్గా వ్యవరిస్తున్న విషయం తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడారు.
‘రిషబ్ పంత్ రాబోయే ఐపీఎల్ సీజన్కు అందుబాటులో ఉండడు. పంత్ గైర్హాజరి ఢిల్లీ క్యాపిటల్స్పై ప్రభావం చూపుతుంది. ఐపీఎల్లోనే కాకుండా ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్లో అందుబాటులో ఉండడు’ అని వివరించారు. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ సిరీస్ అనంతరం దుబాయికి చేరుకున్నాడు. అక్కడి నుంచి డిసెంబర్ 29న ఢిల్లీకి చేరుకొని ప్రైవేటు కారులో రూర్కీలోని తన ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కారు డివైడర్ను ఢీకొట్టింది. ఆ తర్వాత కారుకు మంటలు అంటుకోగా.. బస్ డ్రైవర్లు రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ముంబయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, కుడి మోకాలికి శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. ప్రస్తుతం వైద్యుల పరిరక్షణలో చికిత్స పొందుతుండగా.. ఆరోగ్యంగా మెరుగుపడుతున్నది.