క్రీజులోకి వచ్చిన వాళ్లు వచ్చినట్లు.. బాదుడే పరమావధిగా చెలరేగిపోవడంతో మహిళల ప్రీమియర్లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయం నమోదు చేసుకుంది. యువ ఓపెనర్ షఫాలీ వర్మ ప్రత్యర్థి బౌలర్లను చెడుగుడు ఆడుకోగా.. కాప్సీ, కాప్, జెస్ మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ కొండంత స్కోరు చేసింది. భారీ లక్ష్యఛేదనలో బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధన దంచికొట్టినా.. ఫలితం లేకపోయింది!
WPL | బెంగళూరు: బ్యాటర్లు విజృంభించడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయం నమోదు చేసుకుంది. గురువారం జరిగిన పోరులో ఢిల్లీ 25 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.
ఓపెనర్ షఫాలీ వర్మ (31 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. అలికా కాప్సీ (46; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మరినే కాప్ (16 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జెస్ జాన్సన్ (16 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టారు. కెప్టెన్ మెగ్ లానింగ్ (11), జెమీమా రోడ్రిగ్స్ (0) విఫలమయ్యారు. ప్రత్యర్థి బౌలర్లలో సోఫియా డివైన్, డి క్లెర్క్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్యఛేదనలో బెంగళూరు 9 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (43 బంతుల్లో 74; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఉన్నంతసేపు ధాటిగా ఆడగా.. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (36), సోఫియా డివైన్ (23) ఆమెకు అండగా నిలిచారు. సాధించాల్సిన రన్రేట్ ఎక్కువగా ఉండటంతో పాటు.. మిడిలార్డర్ విఫలమవడంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు.
ఒక దశలో 112/1తో ఫుల్ జోష్లో కనిపించిన బెంగళూరు.. లక్ష్యాన్ని ఛేదించేసేలా కనిపించినా.. ఢిల్లీ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టా మ్యాచ్ను క్యాపిటల్స్ వశం చేశారు. జెస్ జాన్సన్ 3, మరినే కాప్, అరుంధతి రెడ్డి చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన మరినె కాప్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా శుక్రవారం గుజరాత్ జెయింట్స్తో యూపీ వారియర్స్ అమీతుమీ తేల్చుకోనుంది.
సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ: 194/5 (షఫాలీ 50, కాప్సీ 46; సోఫియా 2/23, డి క్లెర్క్ 2/35), బెంగళూరు: 169/9 (స్మృతి 74, మేఘన 36; జెస్ 3/21,కాప్ 2/35).