లక్నో : ఐపీఎల్లో ఢిల్లీ బోణీ కొట్టింది. బుధవారం లక్నోతో జరిగిన పోరులో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. సమీర్ రిజ్వి(47 బంతుల్లో 70 నాటౌట్, 5ఫోర్లు, 4సిక్స్లు) అజేయ అర్ధసెంచరీతో అదరగొట్టగా, స్టబ్స్(32 బంతుల్లో 39 నాటౌట్) సాధికారిక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ప్రిన్స్ యాదవ్(2/20) రెండు వికెట్లు తీశాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. క్యాపిటల్స్ బౌలర్ల ధాటికి 18.4 ఓవర్లలో 141 రన్స్కే కుప్పకూలింది. అబ్దుల్ సమద్ (25 బంతుల్లో 36, 3 ఫోర్లు, 1 సిక్స్), మిచెల్ మార్ష్ (28 బంతుల్లో 35, 2 ఫోర్లు, 3 సిక్స్లు) మినహా మిగిలినవారంతా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ఎంగిడి (3/27), నటరాజన్ (3/29) తలా మూడు వికెట్లు పడగొట్టగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (2/31) రెండు వికెట్లు తీశాడు.
బౌలర్లకు సహకరించే లక్నో పిచ్పై టాస్ గెలవగానే అక్షర్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకోగా అతడి నిర్ణయాన్ని సరైనదే అని నిరూపిస్తూ క్యాపిటల్స్ బౌలర్లు ఆరంభం నుంచే కట్టుదిట్టంగా బంతులేశారు. గత సీజన్లో మార్ష్కు అండగా రాణించిన ఓపెనర్ మార్క్మ్న్రు కాదని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్ (7).. రెండో ఓవర్లోనే దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. అక్షర్ వేసిన పవర్ ప్లే ఆఖరి ఓవర్లో లాంగాన్ మీదుగా సిక్స్ కొట్టిన మార్క్మ్ (11) తర్వాతి బంతికే క్లీన్బౌల్డ్ అయ్యాడు. తర్వాత నటరాజన్.. బదోనిని ఔట్ చేయగా ఎంగిడి, ప్రమాదకర పూరన్ (8)ను బౌల్డ్ చేశాడు. టాపార్డర్ విఫలమవుతున్నా అడపాదడపా షాట్లు ఆడిన మార్ష్.. కుల్దీప్ ఓవర్లో లాంగాఫ్ మీదుగా భారీ షాట్ ఆడబోయి స్టబ్స్ చేతికి చిక్కడంతో లక్నో కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. 10 ఓవర్లకు ఆ జట్టు చేసింది 80/5 పరుగులే. ఈ క్రమంలో సమద్ కాస్త ప్రతిఘటించి వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. ముకుల్ (14), షాబాజ్ (15*)తో కలిసి ఆ జట్టుకు విలువైన పరుగులు జతచేశాడు. కానీ నటరాజన్ తన ఆఖరి ఓవర్లో సమద్ను ఔట్ చేయడంతో లక్నో ఇన్నింగ్స్ ముగియడానికి పెద్దగా టైమ్ పట్టలేదు. 4 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి నాలుగు వికెట్లను కోల్పోయి ఆలౌట్ అయింది.
26/4. స్వల్ప ఛేదనలో 4 ఓవర్లకు ఢిల్లీ స్కోరిది. లక్ష్యం చిన్నదే అయినా ఆ జట్టు ఛేదన కష్టంగానే సాగింది. పటిష్టమైన బౌలింగ్ లైనప్నకు తోడు పిచ్ సహకరిస్తుండటంతో లక్నో బౌలర్లు పవర్ ప్లేలో క్యాపిటల్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించి టాపార్డర్ను పెవిలియన్కు పంపారు. తొలి బంతికి రాహుల్ను షమీ డకౌట్ చేయగా రెండు బౌండరీలు ఓ సిక్స్ కొట్టిన నితీశ్ రాణా (15)ను మోహ్సిన్ ఖాన్ పెవిలియన్కు పంపాడు. తర్వాతి ఓవర్లో ప్రిన్స్ యాదవ్.. ఈ లీగ్లో అరంగేట్రం చేసిన లంక ఓపెనర్ పతుమ్ నిస్సంక (1)తో పాటు అక్షర్ పటేల్నూ ఔట్ చేయడంతో ఢిల్లీ ఆత్మరక్షణలో పడింది. ఈ క్రమంలో రిజ్వి, స్టబ్స్ వికెట్లను కాపాడుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు. క్రీజులో కుదురుకున్నాక షాబాజ్ పదో ఓవర్లో రిజ్వి.. 3 ఫోర్లతో 16 రన్స్ రాబట్టాడు. మార్క్మ్ 14వ ఓవర్లో 6, 4తో 37 బంతుల్లో అతడి అర్ధ శతకం పూర్తయింది. ఆఖరి 6 ఓవర్లలో క్యాపిటల్స్ విజయానికి 36 పరుగులు అవసరం కాగా…రిజ్వి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మోహిసిన్ వేసిన 16వ ఓవర్లో ఓ ఫోర్, సిక్స్తో రిజ్వి 13పరుగులు పిండుకోవడంతో గెలుపు సమీకరణం కాస్తా 24 బంతుల్లో 16కు చేరింది. అప్పటి వరకు పొదుపు బౌలింగ్ చేసిన మోహిసిన్ అదే ఒరవడి కొనసాగించలేకపోయాడు. ఆఖర్లో సమద్ బౌలింగ్లో సిక్స్తో రిజ్వి..ఢిల్లీకి విజయాన్ని కట్టబెట్టాడు.
లక్నో: 18.4 ఓవర్లకు 141 ఆలౌట్ (సమద్ 36, మార్ష్ 35, ఎంగిడి 3/27, నటరాజన్ 3/29)
ఢిల్లీ: 17.1 ఓవర్లలో 145/4(రిజ్వి 70 నాటౌట్, స్టబ్స్ 39 నాటౌట్, ప్రిన్స్ 2/20, షమీ 1/28)