DC vs MI : మహిళల ప్రీమియర్ లీగ్(WPL) టేబుల్ టాపర్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బలమైన ముంబై ఇండియన్స్(Mumbai Indians)పై భారీ విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (33), మేగ్ లానింగ్ (32), అలిసే క్యాప్సే (38) ధనాధన్ బ్యాటింగ్ చేయడంతో 11 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ ముగించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడమే కాకుండా నెట్రన్ రేటు(1.978)లో ముంబై(1.725)ని వెనక్కి నెట్టింది. అంతేకాదు తొలి రౌండ్లో ముంబై చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది.
మహిళల ప్రీమియర్ లీగ్ 18 వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా ఆడింది. బలమైన ముంబై ఇండియన్స్ను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలుత ముంబైని 109 పరుగులకే కట్టడి చేసిన ఢిల్లీ.. ఆ తర్వాత 9 ఓవర్లలోనే టార్గెట్ను ఛేదించింది. షఫాలీ వర్మ ఔటయ్యాక.. మేగ్ లానింగ్ (32), అలిసే క్యాప్సే (38) అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. వీళ్లిద్దరు రెండో వికెట్కు 55 రన్స్ జోడించారు.
మాథ్యూస్, సైకా ఇషాక్ బౌలింగ్లో అలిసే చెలరేగిపోయింది. సిక్స్లు, బౌండరీలతో డీవై పాటిల్ స్టేడియాన్ని హోరెత్తించింది. ఈ జోడీని విడదీసేందుకు హర్మన్ప్రీత్ బౌలర్లను మార్చినా కూడా ఫలితం లేకపోయింది. పవర్ ప్లేలో కీలక వికెట్లు తీసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన మరిజానే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకుంది.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు షఫాలీ వర్మ, మేగ్ లానింగ్ శుభారంభం ఇచ్చారు. ఓపెనర్లు ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు కొట్టారు. దాంతో 4 ఓవర్లలోనే ఢిల్లీ 50 పరుగులు చేసింది. అయితే.. 56 పరుగుల వద్ద షఫాలీ వర్మ (33) స్టంపౌట్ అయింది. హేలీ మాథ్యూస్ ఓవర్లో సిక్స్ కొట్టిన ఆమె తర్వాతి బంతికి షాట్ ఆడబోయింది. కానీ, ఆమె అంచనా తప్పింది. బంతి అందుకున్న యస్తిక వికెట్లను గిరాటేసింది. ఆ తర్వాత లానింగ్, అలిసే ధాటిగా ఆడారు. దాంతో, పవర్ ప్లేలో ఢిల్లీ వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ప్రధాన బ్యాటర్లు విఫలం కావడంతో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు మాత్రమే చేసింది. మరిజానే కాప్ పదునైన పేస్తో ముంబై టాపార్డర్ను కుల్చింది. రెండో ఓవర్ తొలి బంతికి యస్తికా భాటియా(1)ను పెవిలియన్కు పంపింది. ఆ తర్వాతి బంతికే నాట్ సీవర్ బ్రంట్(0)ను బౌల్డ్ చేసింది. శిఖా పాండే ఓవర్లో జెమీమా రోడ్రిగ్స్ మిడాన్లో డైవింగ్ క్యాచ్ పట్టడంతో హేలీ మాథ్యూస్(5) ఔటయ్యింది.
10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ముంబైని కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (23), పూజా వస్త్రాకర్ (26) ఆదుకున్నారు. వీళ్లు ఐదో వికెట్కు 38 రన్స్ జోడించారు. ఆఖర్లో ఇసీ వాంగ్(23), అమన్జోత్ కౌర్ (19) ధాటిగా ఆడడంతో ముంబై వంద పరుగులు చేయగలిగింది. శిఖా పాండే ఓవర్లో హర్మన్ప్రీత్ డీప్ మిడ్వికెట్లో కొట్టిన బంతిని బౌండరీ వద్ద జెమీమా క్యాచ్ అందుకుంది. దాంతో, 74 రన్స్ వద్ద ముంబై ఆరో వికెట్ పడింది. ఆ తర్వాత ఏ దశలోనూ ముంబై కోలుకోలేదు. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే, మరిజానే కాప్, జెస్ జొనాసెన్ రెండేసి వికెట్లు తీశారు. అరుంధతి రెడ్డికి ఒక వికెట్ దక్కింది.