David Warner | మిగ్జాం తుపాను కారణంగా తమిళనాడును వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. భారీ వర్షాల ధాటికి వరదలు పోటెత్తడంతో చెన్నైతో పాటు కాంచీపురం, నాగపట్టనం, కడ్డళూరు, తిరువళ్లూర్ను వరదలు ముంచెత్తాయి. చెన్నైలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. సహాయక సిబ్బంది ఎంత శ్రమిస్తున్నా రోడ్లు వరదతో జలమట్టమవుతున్నాయి. అలాగే రైలు, విమాన సర్వీసులు కూడా దెబ్బతిన్నాయి.
ప్రస్తుతం తుపాను తీరానికి చేరుకోవడంతో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. నగరంలో కొన్ని చోట్ల నిలిచిన వర్షపు నీరు ఇంకిపోతోంది. దీంతో చెన్నై నగరం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఈ పరిస్థితిలో.. ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో తుఫాను బారిన పడిన ప్రజలకు తన మద్దతును తెలిపాడు.
చెన్నైలోని పలు ప్రాంతాలు వరదల బారిన పడ్డాయి. నా ఆలోచనలు ప్రకృతి వైపరీత్యాల బాధితులపైనే ఉన్నాయి. అందరూ సురక్షితంగా ఉండాలి.. అవసరమైతే ఎత్తైన ప్రదేశాల్లో సురక్షితంగా ఉండండి. మీరు సహాయం చేయగలిగే స్థితిలో ఉంటే.. వరదలలో చిక్కుకున్న వారికి సహాయం చేయడం గురించి ఆలోచించండి. అలాగే, మీకు వీలైనంత వరకు మద్దతు ఇవ్వడానికి మేము కలిసి వస్తాము. ప్రతీ ఒక్కరు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. అంటూ వార్నర్ రాసుకోచ్చాడు.